NIA Raids On Khalistan
NIA Raids On Khalistan: కెనడా దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు పన్నూన్ లాంటి వారి నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మరోవైపు రష్యా నుంచి మనం చమురు దిగుమతి చేసుకోవడమే మహా పాపం అన్నట్టుగా వెస్ట్రన్ కంట్రీస్ ఇంటర్నల్గా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే ఇది మహా ఒత్తిడి. ఒకప్పటి భారత్ అయితే ఎలా ఆలోచించేదో తెలియదు గాని.. ఇప్పుడు మాత్రం మొహమాటం లేకుండానే మాట్లాడేస్తోంది. తిరుగులేని ఆలోచన అమలులో పెడుతోంది. ఎదుట ఉంది అమెరికా, పక్కన ఉంది చైనా అనే భయం లేకుండా ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నది.
సమూలంగా అణచివేసే విధంగా..
ఖలిస్థానీ ఉగ్రవాదుల నెట్వర్క్ ను సమూలంగా అణచివేసే లక్ష్యంతో ఎన్ఐఏ పక్కా వ్యూహంతో బుధవారం దాడులకు దిగింది. అక్కడి పోలీసులను సమన్వయం చేసుకుంటూ కార్డన్ -అండ్_ సెర్చ్(కట్టడి ముట్టడి) మాదిరిగా 53 చోట్ల దాడులు నిర్వహించింది. అంటే దాడుల నుంచి అనుమానితులు ఏమాత్రం తప్పించుకునే వీలు లేకుండా వారి ఇళ్లను, చుట్టుముట్టింది. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. మందు గుండు సామాగ్రిని కూడా భారీగా గుర్తించింది. వేర్పాటు వాద సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని ఉదం సింగ్ నగర్ లోని బాజీ పూర్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ మాదిరి మార్చిన తర్వాతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బలగాలు అక్కడి గన్ హౌస్ నిర్వాహకుడు షకీల్ ఇంటిపై దాడులు జరిపింది. షకీల్ తో పాటు అతడి కుమారుడు ఆసిమ్.. ఖలిస్థానీ ఉగ్రవాదులకు ఆయుధాలను అందజేయడంలో సహకరించినట్టు సమాచారం.
కెనడా వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ అధిపతి గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులను ఎన్ఐఏ తో జప్తు చేయించడం ద్వారా తన అసలు ఉద్దేశం ఏమిటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖలిస్థానీ ఉగ్రవాదులకు చాటిచెప్పారు. అతడు మాత్రమే కాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేయిస్తున్నాడు వీరంతా అమెరికా, కెనడా, బ్రిటన్, పాకిస్తాన్, దుబాయ్ ప్రాంతాలలో నివాసం ఉంటూ భారతదేశం మీద విద్వేష ప్రచారం చేస్తున్నారు. పరారీలో ఉన్న వీరిని భారత దేశ భద్రతా సంస్థలు వెంటాడుతున్నాయి. అయితే వీరు వివిధ ప్రాంతాల్లో నక్కి భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా భారత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారు. ఆ మధ్య ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో భారత కాన్సులేట్ భవనాల ఎదుట నిరసనలు చేపట్టారు. జాతీయ జెండాలు తొలగించి ఖలిస్థానీ జెండాలను ప్రదర్శించారు.
ఇక పన్నూ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పంజాబ్లోని అమృత్సర్ జిల్లా ఖాన్కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్లోని సెక్టార్ 15/సీలో ఉన్న ఓ ఇంటిలో నాలుగోవంతు భాగాన్ని జప్తు చేసింది. మొహాలీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలతోనే ఈ ప్రక్రియ చేపట్టింది ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య నేపథ్యంలో, కెనడాలోని హిందువులు ఆ దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ పన్నూ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్ఐఏ ఈ చర్య తీసుకోవటం విశేషం. ‘కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సిక్కులందరూ ఈ దేశ రాజ్యాంగానికి బద్ధులై ఉన్నారు. మీరు మాత్రమే కెనడా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. కాబట్టి, హిందువులారా మీరు కెనడాను వదిలి భారత్కు వెళ్లిపొండి!’ అంటూ పన్నూ ఇటీవల ఓ వీడియోను విడుదల చేశాడు. నిజ్జర్ హత్యలో కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ హస్తం ఉందా? లేదా? అన్నదానిపై అక్టోబర్ 29న ఓ రెఫరెండంను నిర్వహిస్తామని, కెనడాలోని సిక్కులందరూ పాల్గొనాలని పన్నూ ఇటీవల పిలుపునిచ్చాడు. కాగా, పన్నూపై 2019లో ఎన్ఐఏ తొలిసారిగా కేసు నమోదు చేసింది. 2020లో కేంద్ర హోంశాఖ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పన్నూ ఇటీవల భారత దౌత్యాధికారులను అంతమొందిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు. పంజాబ్ రాష్ట్రాన్ని స్వతంత్రదేశంగా ప్రకటించాలని కెనడా, ఆస్ట్రేలియాల్లోని సిక్కులతో రెఫరెండం నిర్వహించాడు. వీటిపై కెనడాకు భారత్ ఫిర్యాదు చేసినా కూడా అతడిపై ఆ దేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీరంతా తమ దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా చేస్తున్నారని భారత్ ఆరోపిస్తోంది. ప్రపంచ వేదికల ముందు పూర్తి ఆధారాలను ప్రదర్శించేందుకు వీరిపై దాడులు మొదలు పెట్టింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమాన పడినట్టే ఈ ఖలిస్తాని ఉగ్రవాదుల ఇళ్లల్లో భారీగా తుపాకులు, మందు గుండు సామాగ్రి, వేర్పాటు వాద సాహిత్యం లభించడంతో తదుపరి ఆధారాల కోసం.. ఎన్ఐఏ బలమైన అడుగులు వేస్తోంది.