Seethakka video: అడవి బిడ్డ.. ఎవరు సాయం అని తలుపుతట్టినా వెంటనే ఆదుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తాజాగా సృహతప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు సీతక్కను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సీతక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఏటూరు మండలం కేంద్రంలో సీతక్క నేృత్వంలో దళిత గిరిజన దండోరా యాత్ర జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ సీతక్క ఏకంగా 4 కి.మీలు పాదయాత్ర చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.
అనంతరం కార్యాలయం బయట కూర్చొన్న సమయంలో సీతక్క ఒక్కసారిగా సొమ్మసిల్లిపడిపోయారు. శరీరమంతా చమటలు పట్టాయి. అక్కడే ఉన్న కార్యకర్తలు వెంటనే సపర్యలు చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం సీతక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సీతక్క అస్వస్థత గురైన విషయం తెలియగానే కాంగ్రెస్ నేతలు ఆరాతీశారు. కార్యకర్తలు ఆస్పత్రికి పోటెత్తారు. ఇక ఆస్పత్రిలో సూపరింటెండెంట్ లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మంచి మనసున్న ప్రజా ప్రతినిధిగా సీతక్క తనకూంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా లాక్ డౌన్ వేళ ఏం దొరకక అల్లాడుతున్న అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు కాలినడకన వెళ్లి ఆమె సహాయం చేసి ఆదుకున్నారు. పేదలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వారి తరుఫున పోరాడటంలో సీతక్క ముందుంటారు. పీపుల్స్ లీడర్ గా గుర్తింపు పొందిన సీతక్క ఇలా అస్వస్థతకు గురికావడంతో నేతలంతా ఆమెను ఫోన్ లో పరామర్శిస్తున్నారు. సీతక్క ఆరోగ్యం కుదుటపడకపోతే హైదరాబాద్ తరలించాలని యోచిస్తున్నారు.