ఆంధ్రప్రదేశ్లో మొదటి విడత నామినేషన్లు.. విత్ డ్రాలు ముగిశాయి. దీంతో ఇప్పటికే ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య లెక్క వెల్లడైంది. అయితే.. ఈ ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనిపై ఆయన నివేదిక కోరారు.
Also Read: జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితికి .. ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలకు పొంతన లేదని ఎస్ఈసీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏకగ్రీవాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించారు. ఏకగ్రీవాలపై చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు వివరణాత్మక నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నివేదికలు పరిశీలించిన తర్వాతే కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లాలో 337 సర్పంచ్ స్థానాలకు 67 స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలయ్యాయి. దీంతో ఆ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 63 చోట్ల అధికార పార్టీ సానుభూతిపరులే ఏకగ్రీవం కాగా.. పీవీపాలెం మండలంలో ఒకటి, కొల్లిపర మండలంలో ఒకటి చొప్పున టీడీపీ సానుభూతిపరులు ఏకగ్రీవం అయ్యారు. ఏ పార్టీ మద్దతు లేకుండా ఇద్దరు ఏకగ్రీవం అయ్యారు. ముందుగా నామినేన్లు పోటాపోటీగా వేసినా ఉపసంహరణకు చివరి రోజు చాలా మంది ముందుకొచ్చారు. దీంతో ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది.
Also Read: ఎన్నికల ‘పంచాయితీ’లో ప్రభుత్వ వాదన కరక్టేనా!
ఇక.. చిత్తూరు డివిజన్లో 112 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అధికార వైసీపీ మద్దతుదారులు 95 మంది, టీడీపీ మద్దతుదారులు 9 మంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు 8 మంది ఉన్నారు. తొలి దఫాలో 468 పంచాయతీలకు గాను 453 చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. మిగిలిన 341 స్థానాలకు ఈనెల 9న పోలింగ్ జరగనుంది. పెద్దసంఖ్యలో ఏకగ్రీవాలు కావడంతో ఇప్పుడు ఎస్ఈసీ ఫోకస్ అంతా ఈ జిల్లాలపైనే పెట్టారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్