ఎన్నో అడ్డంకులు.. సీనియర్ల అభ్యంతరాలు.. అధిష్టానం ఆపసోపాలు.. బోలెడంత కాలయాపన తర్వాత ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి ఈ శుభ ముహూర్తాన ఈరోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గాంధీ భవన్ లో ఉత్తమ్ కుమార్ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ పదవీ బాధ్యతల స్వీకరణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, రాజనర్సింహ, సీనియర్ నేతలు హాజరయ్యారు.
రేవంత్ రెడ్డితోపాటు కొత్త కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు సైతం పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
పీసీసీ బాధ్యతలకు సంబంధించిన పత్రాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు.. కాంగ్రెస్ కు పునర్వైభవం తేవాలని రేవంత్ ను ఆకాంక్షించారు.
ఇక రేవంత్ రెడ్డి తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా పెద్ద మ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. నాంపల్లి దర్గాలో చాదర్ సమర్పించారు. అక్కడి నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల మధ్య గాంధీ భవన్ కు చేరుకొని పగ్గాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది.