కిటికీ సేవలు ఎంత కాలం?

ప్రభుత్వ కార్యాలయాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం వచ్చేపోయే వారితో సందడిగా ఉండే కార్యాలయాలు ఇప్పుడు భయం నీడలో పనిచేస్తున్నాయి. అత్యవసర, తప్పనిసరి పనుల కోసం కొందరు వస్తూనే ఉన్నారు. నేరుగా ప్రజలను కలిసేందుకు జంకుతున్న అధికారులు దరఖాస్తులు, వినతిపత్రాలను ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు. కొన్ని తహసీల్దార్‌, పురపాలక సంఘాలు, ఎంపీడీఓ కార్యాలయాలలో ప్రధాన ద్వారాలు మూసేసి, కిటికీలని మాత్రం తెరిచి లోపల రెండు అట్టపెట్టెలను పెట్టి, సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారిని ఆ […]

Written By: Neelambaram, Updated On : July 10, 2020 10:38 pm
Follow us on

ప్రభుత్వ కార్యాలయాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం వచ్చేపోయే వారితో సందడిగా ఉండే కార్యాలయాలు ఇప్పుడు భయం నీడలో పనిచేస్తున్నాయి. అత్యవసర, తప్పనిసరి పనుల కోసం కొందరు వస్తూనే ఉన్నారు. నేరుగా ప్రజలను కలిసేందుకు జంకుతున్న అధికారులు దరఖాస్తులు, వినతిపత్రాలను ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు. కొన్ని తహసీల్దార్‌, పురపాలక సంఘాలు, ఎంపీడీఓ కార్యాలయాలలో ప్రధాన ద్వారాలు మూసేసి, కిటికీలని మాత్రం తెరిచి లోపల రెండు అట్టపెట్టెలను పెట్టి, సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారిని ఆ పెట్టెల్లో వినతిపత్రాలను వేసి వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువ ఉంటోంది. భూవివాదాలు, భూ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పదుల సంఖ్యలో తహసీల్దార్‌ కార్యాలయాలకు జనం వస్తూనే ఉన్నారు.

భూవివాదాలు, రైతుబంధు నేపథ్యంలో తహసీల్దార్‌ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. రెవెన్యూ అధికారులు దగ్గరలోని వీఆర్వోల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. వీఆర్వోలు విధిగా గ్రామాల్లో ఉండాలని.. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ లు సూచిస్తున్నారు. భూవివాదాలు, భూముల సర్వేలకు సంబంధించిన సమస్యలపైనే ఎక్కువమంది రెవెన్యూ   కార్యాలయాలకు వస్తున్నారు.అయితే క్షేత్రస్థాయికి వెళ్లి ఆ పనులు చేసేందుకు సర్వే అధికారులు జంకుతున్నారు. సాధారణంగానే భూముల సర్వే అంశంలో తీవ్ర జాప్యం జరిగేది. తాజా పరిస్థితుల వల్ల జాప్యం మరింత పెరిగింది.

ఉద్యోగుల్లో ఎవరికైనా కరోనా సోకితే మిగిలినవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో సిబ్బంది అందరికీ పరీక్షలు చేస్తున్నారు. కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. శానిటైజేషన్‌ సహా వివిధ జాగ్రత్తల అనంతరమే తెరుస్తున్నారు. దీనివల్ల కూడా వివిధ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో కిటికీ సేవలు ఇంకా ఎంతకాలమో తెలియక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.