Revanth On Malla Reddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన అవినీతి అక్రమాల చిట్టాను మీడియా ముఖంగా వెల్లడించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భూ అక్రమాలపై సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని భూ పత్రాలు చూపిస్తూ.. ఇందులో మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి పేరు మీదకు 16 ఎకరాలు రిజిస్టర్ అయ్యాయని.. ఇది ఎలా వచ్చిందో వివరాలు లేవన్నారు.. మళ్లీ ఈ భూమి మల్లారెడ్డి యూనివర్సిటీ కి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. 650 సర్వే నెంబర్ లోని భూమిని కొందరు లేఅవుట్ చేసి ఫ్లాట్లుగా అమ్మారన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి అనుమతులు ఎలా వచ్చాయి..? భూ బాగోతం మాయ ఏంటి? చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జవహర్ నగర్ మున్సిపాలిటీలో సర్వేనెంబర్ 488లో 5 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్ శాఖ నిషేధంలో ఉంచింది. ఇదే సర్వేనెంబర్ లో సీఎంఆర్ మెడికల్ కాలేజ్ ఎలా ఏర్పాటు అయ్యిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్ నిషేధం విధిస్తే ఎలా జరిగిందని కోరారు. ప్రభుత్వ భూమిని మంత్రి కబ్జా చేస్తే కనపడటం లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లో చర్చల సందర్భంగా అవినీతికి తావులేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. అవినీతికి ఎవరు గురైన చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మీద ఆరోపణలు వస్తే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారని.. ఈటల రాజేందర్ మీద అసైన్డ్ భూములు ఆక్రమించారని భర్తరఫ్ చేశారని.. దేవరయంజాల్ లో దేవుని భూములు ఆక్రమించారని ఐఏఎస్ ల కమిటీ వేశారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇస్తున్న ఇప్పుడు ఆయనను ఏం చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
50 ఎకరాలలో లేఅవుట్ వేస్తే.. మామూళ్లు ఇవ్వాలని బహిరంగంగా వసూలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ అక్రమాలపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని ఆరోపించారు. గుండ్లపోచంపల్లిలో సర్వేనెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉండేదని.. ఈ భూమి ఒక్కసారిగా ధరణి పోర్టల్ కు వచ్చేసరికి 33 ఎకరాల 26 గుంటలుగా మారిందని రేవంత్ ఆరోపించారు.
న్యాక్ గ్రేడింగ్ కోసం పెట్టిన పత్రాలన్ని పోర్జరీ పత్రాలని .. న్యాక్ నిషేధించిందన్నారు. ఫోరెన్సిక్ ధృవపత్రాలన్ని తప్పుడువని 5 ఏళ్లు న్యాక్ నిషేధించిందన్నారు. 420 కింద జైల్లో వేయాల్సిన మల్లారెడ్డి ని మంత్రిని చేసిన ఘనత కేసీఆర్ దేనని రేవంత్ ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ లో విజిలెన్స్ విచారణలో వందల కోట్లు దోపిడీ చేసిందని వెల్లడైందన్నారు. పచ్చిదొంగ లంగలను కేసీఆర్ ప్రొత్సహిస్తున్నారని రేవంత్ విమర్శించారు. దత్తత పేరుతో గ్రామాలను తీసుకొని.. ఫాంహౌస్ కు రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తే.. ప్రతిపక్షం తరపున ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. మూడు గ్రామాల్లో ఇచ్చిన హామీలను సీఎం హోదాలో కూడా అమలు చేయలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చి కుక్కలుగా ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. తిట్ల పోటీ పెట్టుకుందామంటే మేం రెడీ. ప్రగతి భవన్ కు లేదా ఫాంహౌస్ కు రమ్మనా వస్తానని రేవంత్ సవాల్ చేశఆరు.
మల్లారెడ్డి అవినీతిని కేటీఆర్, కేసీఆర్ సమర్థిస్తున్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2019లో నేను గెలించిందే మల్లారెడ్డి మీద.. నేను సవాల్ చేస్తున్న.. ప్రభుత్వాన్ని రద్దు చేసి రమ్మను.. అంత ధైర్యం లేకపోతే.. గజ్వేల్ లో రాజీనామా చేయి.. తేల్చుకుందాం. మధ్యలో చెంచాలతో తొడగొట్టడాలేం అని రేవంత్ రెడ్డి తొడగొట్టారు.
ముందస్తు ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ బలం ఏంటో చూపిస్తామన్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ తదితరులు రేవంత్ రెడ్డి వెంట పాల్గొన్నారు.