ఇక్కడ నుంచి గతంలో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కంటే ఎక్కువ ఓట్లు సాధించాలనే పట్టుదలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. గెలుపోటములు ఎలా ఉన్నా ఎక్కువ ఓట్లు సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై కసరత్తు పూర్తయింది. టీపీసీసీకి ముగ్గురి పేర్లతో ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నివేదిక అందజేశారు. ఈ ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
నివేదికలో ముగ్గురి పేర్లలో ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారి పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. నివేదికతో రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ నివేదికతో ఢిల్లీ వెళ్లనున్నారు. సోనియాగాంధీ ఆమోదంతో కొండా సురేఖ అభ్యర్థిత్వం ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థి విషయంలో మొదట పొన్నం ప్రభాకర్ గురించి చర్చ జరిగినా సామాజిక వర్గ సమీకరణలో సురేఖ వైపే మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
అయితే హుజురాబాద్ సీటుపై కొండా సురేఖ ఇప్పటికే అధిష్టానానికి పలు డిమాండ్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇందులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అర్బన్, పరకాల, భూపాలపల్లి స్థానాలు తాను సూచించిన వ్యక్తులకే టికెట్లు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అందుకే హుజురాబాద్ నుంచి పోటీకి సై అన్నట్లు సమాచారం. భూపాలపల్లి విషయంలో మాత్రం వెనక్కి తగ్గేందుకు సుముఖంగా లేనట్లు సూచించినట్లు తెలిసింది.
సామాజికవర్గాల పరంగా చూస్తే కొండా సురేఖ సామాజికవర్గం ఓట్లు 26,350 ఓట్లు, మురళి సామాజిక వర్గం ఓట్లు 29,100 తో కలుపుకుంటే అత్యధికంగా ఓట్లు పడతాయని భావించి ఈ మేరకు ఆమె అభ్యర్థిత్వానికి ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు ఈటల సామాజికవర్గం ఓట్లు 23,220, ఆయన సతీమణి సామాజికవర్గం ఓట్లు 22,600 కలుపుకుంటే మెజార్టీ ఖాయమని దీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో ఎంత మేర లబ్ధి పొందుతారో తేలాల్సి ఉంది.