తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ప్రస్థానాన్ని కేసీఆర్ మొదలు పెట్టినప్పుడు ఆయన వెంట పిడికెడు మంది మాత్రమే ఉన్నారు. ఆ పిడెకుడు మందిలో ఈటల రాజేందర్ అతి ముఖ్యుడు అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రత్యే రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడానికి ప్రధాన కారకుల్లో ఈటల పేరు ప్రముఖంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.
2001లో టీఆర్ఎస్ మొదలైనప్పుడు జెండా మోసేందుకు కూడా జనం లేరు. కేవలం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన వారిలో రాజేందర్ ఉన్నారు. అప్పటి నుంచి 2014లో రాష్ట్రం సిద్ధించే వరకూ ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. టీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబాన్ని దాటితే.. ప్రముఖంగా కనిపించే వారిలో ఈటల రాజేందర్ ముందు వరసలో ఉంటారు. ఆయనపై ఇప్పటి వరకూ ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలు కూడా లేవు.
కానీ.. ఉన్నట్టుండి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తింది. ఇందులో నిజానిజాలు ఏంటనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. కానీ.. ఈటలపై పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందనే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఈటలకు సానుభూతి కూడా పెరుగుతోంది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో చివరకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని పలువురు సానుభూతి చూపిస్తున్నారు. ఈటల సైతం ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. తనపై పథకం ప్రకారమే దాడి జరిగిందని చెబుతున్న ఆయన.. తన వ్యక్తిత్వాన్ని చంపేశారని ఆయన వాపోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే.. ఇంతటితో ఆగుతుందా? లేక జైలు దాకా వెళ్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎందరికో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వారిలో ఈటల వంటివారు కూడా చేరడం బాధాకరమనే అభిప్రాయం వ్యకమమవుతోంది.