ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంక్ సహా 5 బ్యాంకులు కనుమరుగు!

ఆంధ్ర బ్యాంక్ సహా మరో ఐదు బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో బ్యాంకుల సంఖ్య 10 నుంచి 4కు తగ్గుతుంది. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేస్తారు. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లోను, ఆంధ్రా బ్యాంక్, […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 12:03 pm
Follow us on

ఆంధ్ర బ్యాంక్ సహా మరో ఐదు బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో బ్యాంకుల సంఖ్య 10 నుంచి 4కు తగ్గుతుంది. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేస్తారు. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లోను, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను, అలహాబాద్ బ్యాంక్ కూడా ఇండియన్ బ్యాంక్‌లోను విలీనానికి రంగం సిద్ధం చేశారు. ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచిలుగా మారిపోనున్నాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచిలు పీఎన్‌బీ బ్రాంచులుగా, సిండికేట్ బ్యాంక్ బ్రాంచిలు కెనరా బ్యాంక్ బ్రాంచిలుగా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచిలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలుగా రూపాంతరం చెందుతాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచిలు ఇండియన్ బ్యాంక్ బ్రాంచిలుగా పనిచేస్తాయి.

విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి 7 పెద్ద బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. 2017లో ప్రభుత్వ రంగంలో దాదాపు 27 బ్యాంకులు ఉండేవి. విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూడో అతిపెద్ద బ్యాంక్ అవుతుంది. దీని తర్వాతి స్థానంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్లు ఉంటాయి. ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని కేంద్రం ప్రకటించిన వెంటనే తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం విలీనం తరువాత అయిన ఆంధ్ర బ్యాంకు పేరుతో కొనసాగించాలని కోరారు. కేంద్రం ఈ విన్నపాలను పరిగణనలోకి తీసుకోలేదు. యూనియన్ బ్యాంకులో ఆంధ్ర బ్యాంకును విలీనం చేసి మొత్తాన్ని యూనియన్ బ్యాంకుగా మార్చనున్నారు.