Coromandel Express Accident: అది ఘోర ప్రమాదం. 230 పైచిలుకు ప్రయాణికులు దుర్మరణం చెందారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరకు సంతాపం తెలిపారు. ఇంతటి దుఃఖసాగరంలో ప్రభుత్వాలు చేయాల్సినన్ని చేస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రమాదం జరిగిన మరుసటి రోజు నుంచి ఇవాల్టి వరకు అక్కడే ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు. కేవలం 51 గంటల్లో ట్రాక్ ను పునరుద్ధరించారు. రైల్వే రాకపోకలు జరిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అంతటి విషాదంలో ఇంతటి మెరుపు వేగంతో పనులు చేయడం వెనుక ఉన్న ఆ వ్యక్తి పేరు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవ అని చెప్పాలి.. ఇప్పుడు ఆయన పదవీ నిరత గురించి అందరూ కొనియాడుతున్నారు. శభాష్ రైల్వే శాఖ మంత్రి జి అని పొగుడుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే..
కోరమాండల్ ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ మంత్రి హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లారు. సహాయక చర్యలను అనుక్షణం దగ్గర ఉండి పర్యవేక్షించారు. రైల్వే శాఖ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతటి ఘోర ప్రమాదం తర్వాత కేవలం 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ జరిగిందంటే దానికి కారణం అశ్విని వైష్ణవ్ చొరవే. ఒకవైపు ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తూనే.. ఇంకోవైపు సహాయక చర్యలు ఊపందుకునేలా అధికారులను పరుగులు పెట్టించారు. శనివారం నుంచి అక్కడే మకాం వేశారు. పనులను నిరంతరం పర్యవేక్షించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదానికి గురైన ట్రాక్ మరమ్మతులు, ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెరిగేలా చూశారు. గతంలో రైల్వే మంత్రులుగా పని చేసిన వాళ్ల కంటే అశ్విని వైష్ణవ్ ఈ విషయంలో చాలా భిన్నంగా కనిపిస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రాక్ పునరుద్ధరణ
ప్రమాద స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ మార్గం మీదుగా ట్రైన్ రన్ కూడా నిర్వహించారు. తొలుత గూడ్స్ రైలు ను రన్ చేశారు. ఆ తర్వాత మిగతా రైళ్ళను ట్రయల్స్ వేశారు.. ఈ ట్రయల్ జరుగుతున్నప్పుడు కేంద్రమంత్రి ఉద్వేగానికి గురయ్యారు. రెండు చేతులు జోడించి నమస్కరించారు. ట్రైన్ ట్రైన్ సక్సెస్ కోసం ఆకాశం వైపు చూస్తూ దేవుడిని ప్రార్థించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
గతంలో ఇలా కాదు..
గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రులుగా పని చేశారు. వీరి హయాంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు..ఏదో మీడియాలో కనపడేందుకు అక్కడికి వెళ్లేవారు. ప్రమాద బాధితులతో ఫోటోలు దిగేవారు. ఆ తర్వాత అటువైపు కూడా ముఖం చూపించేవారు కాదు. కోరమాండల్ ప్రమాదం నేపథ్యంలో గతంలో పనిచేసిన మంత్రుల కంటే అశ్విని వైష్ణవ్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి నేటి వరకు ఆయన సహాయక చర్యలు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రి కి ప్రమాదం ఎలా జరిగిందో వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించడం దగ్గర నుంచి ట్రాక్ పునరుద్ధరణ వరకు అన్నింటిలోనూ అశ్విని వైష్ణవి తన మార్కు చూపించారు. క్షేత్రస్థాయిలో ఆయన పకడ్బందీగా వ్యవహరించకపోయి ఉంటే ఈ స్థాయిలో ఫలితం వచ్చి ఉండకపోయేదని రైల్వే శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంతటి ఉత్పాతం జరిగినప్పటికీ కేవలం ప్రతిపక్షాలు తప్ప.. బాధితులు ఒక్క ఆరోపణ కూడా కేంద్ర ప్రభుత్వం మీద చేయడం లేదంటే దానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చూపిన చొరవే కారణం.
K.R. is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More