మెగాస్టార్ చిరంజీవిని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తాజాగా కలుసుకోవడం ఆసక్తిని రేపుతుంది. వీరిద్దరూ చాలాకాలం తర్వాత భేటి కావడం రాజకీయ, సీని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి, రఘువీరారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ అంత యాక్టివ్ గా కనిపించడంలేదు. ఈ క్రమంలోనే వారిద్దరు మళ్లీ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి రఘువీరారెడ్డి వెళ్లారు. తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు. మే 29న తన గ్రామంలో ఏర్పాటు చేసిన 52అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరణకు రావాలని కోరారు. ఈ సందర్భంగా కొంత రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
చిరంజీవితో రఘువీరారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నుంచి చిరంజీవికి లేదా రఘువీరారెడ్డికి రాజ్యసభ అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రఘువీరారెడ్డి చిరంజీవితో మళ్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం చిరంజీవి సినిమాలతో బీజీగా ఉన్నారు. వైసీపీ ఇచ్చే రాజ్యసభ ఆఫర్ చిరంజీవి ఇప్పటికే సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి సన్నిహిత్యంగానే ఉంటున్నారు. దీంతో వీరిద్దరు భేటీ కావడం అటూ రాజకీయ, ఇటూ సీనీ ప్రముఖుల్లో ఒకింత ఆసక్తిని రేపుతోంది.