China Brahmaputra Dam: భారత్ తో నిత్యం కవ్వింపులకు.. అంతర్గత ఘర్షణలకు పాల్పడుతూ ఉంటుంది చైనా. ఆ మధ్య గాల్వాన్ లోయలో ఘర్షణకు పాల్పడింది. అంతర్జాతీయ వేదికల మీద భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటుంది.. పైగా మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల చిత్రపటాలను మార్చుతూ ఉంటుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని.. తన పరిధిలో ఉందన్నట్టుగా చైనా చెబుతూ ఉంటుంది. ఆ ప్రాంతాలకు చైనా పేర్లు పెడుతూ ఉంటుంది. ఈ విషయంపై భారత్ అనేకసార్లు చైనాతో వాగ్వాదానికి దిగింది. చైనా తీరును తప్పు పట్టింది.
మనదేశంలో ఈశాన్య రాష్ట్రాలకు అత్యంత ముఖ్యమైనది బ్రహ్మపుత్రా నది. ఈ నది ప్రవాహం ఆధారంగానే ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్ దాకా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది. ఈ నది చైనా నుంచి మనదేశంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. చైనాలో ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం కొద్దిరోజులుగా ప్రణాళిక రూపొందించింది. దీనిపై భారత్ అభ్యంతర వ్యక్తం చేసినప్పటికీ చైనా పట్టించుకోలేదు. పైగా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టును చైనా బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తోంది. గత ఏడాది దీనికి సంబంధించిన పనులను మొదలుపెట్టింది.
బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ విషయం చైనా శాస్త్రవేత్తల అధ్యాయంలో బయటికి వచ్చింది. బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టు సంబంధించి భూభాగం సక్రమంగా లేదని.. అందులో ఒక క్రియాశీలకమైన పగులు ఉందని.. అది మౌలిక సదుపాయాల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని చైనా భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టును చైనా టిబెట్ లోని ఓ నగరం పరిధిలో నిర్మిస్తోంది. ఇటీవల చైనా జియాలాజికల్ సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కీలకమైన అధ్యయనం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రాంతంలో అడుగు భాగంలో ఒక పగులు ఉందని.. అది రాళ్ల భాగాన్ని మొత్తం చీల్చి వేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా ఆ పగులు కొన్ని వేల సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.. పగలు ఏర్పడటం వల్ల జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే వంతెనలు.. నీటి ప్రాజెక్టులు.. రోడ్లు.. సొరంగాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టుకు సమీపంలో పై అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం భూకంపం ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 9 సంవత్సరాల క్రితం ఇక్కడ 6.9 తీవ్రతతో భూమి కంపించింది.
