వైసీపీపై రఘురామ చేస్తున్న పోరాటం ఏడాదిన్నరగా సాగుతోంది. దీంతో జగన్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రఘురామపై పెట్టిన సీఐడీ కేసు తర్వాత ఆయన రూటు మార్చడంతో ఇప్పుడు వైసీపీకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. జగన్ వర్సెస్ రఘురామ అంకం తుది దశకు చేరుకుంటుందని అందరు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రయోగించే బుల్లెట్ మిస్ ఫైర్ అయితే మాత్రం జగన్ మరింత కష్టాల్లో పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వేటు కోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి పలుమార్లు విన్నవించినా పలితం లేకపోయింది. స్పందన లేకపోవడంతో ఇక ముఖాముఖి పోరుకే రెడీ అయిపోయారు. లోక్ సభ స్పీకర్ ను టార్గెట్ చేస్తూ పార్లమెంట్ లో నిరసన చేపట్టేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలంతా రఘురామపై అనర్హత వేటు వేయాలని నిరసన చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ చేస్తున్న పోరు తుది అంకానికి చేరినట్లు భావిస్తున్నారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్, రఘురామ వ్యవహారంలో క్లైమాక్స్ ఏంటో చెప్పేశారు. ఒక ఎంపీపై ప్రజల మద్దతు కలిగిన సీఎం పోరాటం చేయడం ఆయనకే నష్టమని స్పష్టం చేశారు. ఏడాదిన్నర క్రితం మొదలైన రఘురామ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరిందని అని పేర్కొన్నారు. రఘురామ విసురుతున్న వలలో జగన్ చిక్కుకుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలంతా నిరసనకు దిగితే అది రఘురామకే ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇంత మంది ఎంపీలు అంతా కలిసి ఒకడినే టార్గెట్ చేస్తే ప్రచారం ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు కోరుతున్న రెబల్ ఎంపీగా జాతీయ స్థాయిలో పెరుతెచ్చుకున్న రఘురామ ఇప్పుడు పార్టమెంట్ లో సైతం తన ప్రభావాన్ని చూపించుకున్నట్లు అవుతుంది. మొత్తానికి పార్లమెంట్ వేదికగా దేశం మొత్తం ప్రచారం అయ్యే వీలుంటుంది. అప్పుడు వైసీపీకే నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులుచెబుతున్నారు.