
ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఉన్న గాంధీ హాస్పిటల్ కు మాత్రమే పరిమితమైన కరోనా వైరస్ పరీక్షలను ఇక నుండి చేయడానికి హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ ల్యాబ్ లు సిద్ధమవుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నుండి అనుమతి లభించడంతో వారు సిద్దపడుతున్నారు. అయితే వారే సొంతంగా కిట్స్ ను సమకూర్చుకోవాలని, రూ 4,500 కన్నా ఎక్కువ ఛార్జ్ చేయరాదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
ఈ నెల 30వ తేదీ నుంచి కరోనా టెస్టులను ప్రారంభించినున్నట్టు విజయ డయాగ్నస్టిక్స్శుక్రవారం ప్రకటించింది. విజయాతోపాటు రాష్ట్రంలోని అపోలో జూబ్లీహిల్స్, బోయిన్పల్లి సెంటర్లు, విమ్టా డయాగ్నస్టిక్స్, డాక్టర్ రెమిడీస్, పాథ్కేర్ ల్యాబ్స్, సిటిజన్ హాస్పిటల్లోని అమెరికన్ ల్యాబ్లలో కరోనా టెస్టులు చేసేందుకు కేంద్రం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది.
ఇప్పటివరకు తెలంగాణాలో గాంధీ హాస్పిటల్లో మాత్రమే కరోనా టెస్టులు చేస్తుండగా.. శనివారం నుంచి ఫీవర్ హాస్పిటల్, నారాయణగూడలోని ఐపీఎం, నిమ్స్, ఉస్మానియా హాస్పిటళ్లలోనూ కూడా చేయనున్నారు. కాగా, రాష్ట్రాలకు ఐసీఎంఆర్ మాత్రమే కిట్లను పంపిస్తుండగా.. వారం రోజుల్లో ప్రైవేటుగానూ కిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
అంతేగాకుండా ఎవరికి పడితే వారికి టెస్టులు చేయడానికి వీలు లేదు. డాక్టర్ పరీక్షించి, టెస్ట్ అవసరమని నిర్ధారించిన వాళ్లకు మాత్రమే చేయాల్సి ఉంటుంది. టెస్ట్ రిజల్ట్ను కూడా నేరుగా పేషెంట్కు ఇవ్వకూడదని, రిఫర్ చేసిన డాక్టర్కు మాత్రమే ఇవ్వాలని ఐసీఎంఆర్ సూచించింది.
మార్చి 30 నుంచి టెస్టులు చేస్తామని ప్రైవేటు ల్యాబ్లు ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వ దవాఖానాల్లో చేయలేనప్పుడే ప్రైవేటుకు అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్టెస్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్) పద్ధతిలో కరోనా డయాగ్నసిస్ టెస్టులు చేస్తున్నారు. ఈ పద్ధతిలో టెస్టు రిజల్ట్ రావడానికి 6 గంటల నుంచి 7 గంటలు పడుతుందని చెబుతున్నారు.