Prithviraj vs Jagan : సినిమా నటుడు ఫృథ్వీరాజ్ కామెంట్స్ ఇటీవల హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణల తరువాత ఫృధ్వీరాజ్ వైసీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరోసారి అదే పంథాలో సెటైరికల్ డైలాగ్స్ విసిరాడు. జగన్ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ఓ సినిమా తీస్తానని ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం జగన్ కు సపోర్టుగా జనసేన, టీడీపీలకు వ్యతిరేకంగా ఉంటుందని వర్మ బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ సినిమాలో అవకాశం ఇస్తే తాను కూడా నటిస్తానని ఫృద్వీరాజ్ అంటున్నారు. ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్న ఫృధ్వీరాజ్ ఇలాంటి డైలాగ్స్ కొట్టడం రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన వర్మ సినిమాలో నటించడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? అసలేంటి కథ?
30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అన్న ఒక్క డైలాగ్ తో ఫుల్ ఫేమస్ అయిపోయారు ఫృధ్వీరాజ్. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించిన ఆయన డైలాగ్ డెలివరీనీ అద్భుతంగా రిలీజ్ చేస్తూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఫృధ్వీరాజ్ కు సినిమాల్లో అవకాశాలు తగ్గినా రాజకీయంగా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. జనసేనలో చేరినప్పటి నుంచి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ పవన్ కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వర్మ తీసే సినిమాపై ఫృద్వీరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ ను నమ్మరు అంటూ మొదలుపెట్టారు.
జగన్ కు సానుభూతి వచ్చేలా పవన్, చంద్రబాబుకు వ్యతిరేకంగా రాంగోపాల్ వర్మ సినిమా తీయాలని చూస్తున్నారు. ఉద్ధేశపూర్వకంగా సినిమాలు తీస్తే జనాలు చూసే రోజులు పోయాయని అన్నారు. ఆర్జీవీ తీసే సినిమాల వల్ల ఆయనకు, నిర్మాతలకు తప్ప మరెవరికీ ఉపయోగం ఉండదని చెప్పారు. తాను తీసే సినిమాతో చంద్రబాబును కుప్పంలో ఓడిస్తాం అని అనుకోవడం హస్యాస్పదం అని ఫృధ్వీరాజ్ అన్నారు.
అయితే జగన్ మంచి పనులు చేశారని, వాటిపై సినిమాలు తీయాలని ఆర్జీవికి సూచించారు. అలా తీసే సినిమాల్లో తాను కూడా నటిస్తానని ఫృధ్వీరాజ్ చెప్పారు. అయితే 2024లో 153 సీట్లు గెలుస్తారు. కానీ జగన్ ప్లేసులో పవన్ ఉంటారని జోష్యం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ కు వ్యతిరేకత ఉందని, పవన్ కచ్చితంగా గెలుస్తాడని ఫృధ్వీరాజ్ అన్నారు. ఫృధ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హైలెట్ గా మారాయి.