Thummala – Ponguleti : తుమ్మల ఇంటికి పొంగులేటి.. ఏకమవుతున్న శత్రువులు.. కేసీఆర్‌ కు షాక్ లగా!

ఇప్పుడు తుమ్మలకు కూడా అదేవిధంగా పొమ్మనకుండా పొయ్యిపెట్టి అవమానపరంగా పార్టీనుంచి పంపించే కార్యక్రమం చేపట్టారని, పొంగులేటి ఆరోపించారు.

Written By: NARESH, Updated On : September 2, 2023 7:41 pm

Ponguleti thummala

Follow us on

Thummala – Ponguleti : ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి శనివారం పీసీసీ ప్రచార కమిటీ కో_ కన్వీనర్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లి తుమ్మల నాగేశ్వరావును కలిసి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. హైదరాబాదులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు పలువురు నేతలు తుమ్మల ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని కోరిన విషయం విదితమే. హైదరాబాదు నుంచి ఖమ్మానికి పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తుమ్మల నివాసం వద్ద శనివారం ఉదయం నుంచే కోలాహలం మొదలయింది. తుమ్మల వచ్చిన విషయం తెలుసుకున్న ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నేతలు తుమ్మలను కలిసి చర్చించారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో తుమ్మల ఇంటికి వచ్చి తుమ్మలకు శాలువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తుమ్మల కూడా పొంగులేటిని శాలువాకప్పి సత్కరించారు. ఆతర్వాత తుమ్మల, పొంగులేటి కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయడమే నా రాజకీయ లక్ష్యం

“సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే నా రాజకీయ లక్ష్యం. గోదావరి జలాలను అధికారికంగా నీళ్లను వదిలి అదే వేదిక మీద నా రాజకీయ జీవితానికి ఇంతకాలం సహకరించిన ఖమ్మంజిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్పి రాజకీయాల నుంచి విరమించుకోవాలన్నదే నాజీవిత కోరిక అని,ఆ కోరిక కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్టు” మాజీమంత్రి తుమ్మల ప్రకటించారు. పొంగులేటితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. నారాజకీయ జీవితం నాకోసం కాదు. నాకుటుంబంకోసం కాదు , నాస్వార్దం కోసం కాదు అని ఉమ్మడి జిల్లా అభివృద్ధికోసం , ప్రజాశ్రేయస్సు కోసమేనని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజల జీవితం మెరుగుపరిచేందుకోసం మంత్రిగా కృషిచేశానని, అన్నీ ప్రభుత్వాల సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచేలా ఆదర్శవంతంగా ఉండేలా కృషి చేశానని పేర్కొన్నారు. ఉన్న పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు పూర్తిచేస్తూ అనేకసాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, వంతెన పూర్తిచేయగలిగానని పేర్కొన్నారు.

రాజకీయ కురుక్షేత్రంలో కేసీఆర్‌ కూటమి ఓటమి ఖాయం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ కురుక్షేత్రంలో కేసీఆర్‌ కౌరవ కూటమి ఓటమి ఖాయమని, పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో కన్వీనర్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మంజిల్లా నుంచి పోటీచేయాలని, మూడు జనరల్‌ స్థానాల్లో కేసీఆర్‌ ఎక్కడ నిలబడితే నేను అక్కడ పోటీచేస్తానని, మైనారిటీల మీద పోటీచేయడం రాజకీయంకాదని పొంగులేటి పేర్కొన్నారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన అనంతరం మీడియాతో పొంగులేటి మాట్లాడారు. తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌ నాయకులని, నిబద్దత, చిత్తశుద్దితో పనిచేసే వ్యక్తిత్వం ఆయనదని,జిల్లా, రాష్ట్రప్రజల తరుపు తుమ్మల కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించామన్నారు.. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో రాక ముందు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో టీఆర్‌ఎస్‌ బలం ఒకటి,రెండుశాతం అని, తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేయడంతోపాటు పార్టీని కూడా తన శక్తిమేర అబిృద్ధిచేశారని, తుమ్మల ఆహ్వానం మేరకే నేను, ప్రస్తుత మంత్రి అజయ్‌కుమార్‌ టీర్‌ఎస్‌లో చేరామని గుర్తుచేశారు. కొన్ని శక్తులు కుయుక్తులతో పార్టీనుంచి పంపేందుకు పొయ్యి లేకుండానే పొమ్మనకుండా పొగ పెట్టారని, ముందుగా నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు తుమ్మలకు కూడా అదేవిధంగా పొమ్మనకుండా పొయ్యిపెట్టి అవమానపరంగా పార్టీనుంచి పంపించే కార్యక్రమం చేపట్టారని, పొంగులేటి ఆరోపించారు.