Karnataka Assembly Elections 2023: వంద మునుగోళ్లు, వెయ్యి హుజురాబాద్ లు: ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎన్నికలు చాలా కాస్ట్ లీ గురూ!

కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కుమారస్వామి పార్టీ జెడిఎస్ కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ.. టి ప్రధానంగా 50 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తుంది అనే విశ్లేషకులు అంటున్నారు.

Written By: Bhaskar, Updated On : April 28, 2023 12:27 pm
Follow us on

Karnataka Assembly Elections 2023: ప్రియాంక గాంధీ దోశలు వేస్తోంది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నాడు. నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నాడు. అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేదే లేదని చెప్తున్నాడు. మల్లికార్జున ఖర్గే మోదీ విష సర్పం లాంటివాడని ఆరోపిస్తున్నాడు.. ఇక చిన్న చితకా నేతలయితే కనీసం ఊపిరి కూడా తీసుకోవడం లేదు. అన్ని పార్టీలకు ఆ స్థాయిలో ముఖ్యమైపోయాయి కర్ణాటక ఎన్నికలు. ఇదంతా క్షేత్రస్థాయిలో ఒక ఎత్తు. కనిపించని మరో ఎత్తు రాజకీయ విశ్లేషకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఔరా అని నోరు వెళ్లబెట్టేలా చేస్తోంది.

డబ్బు ప్రధానం.. డబ్బే ప్రధానం

ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా.. ఇప్పుడు ఆ డబ్బే కర్ణాటక ఎన్నికలను శాసిస్తోంది. ఆ మధ్య మన తెలంగాణలో మునుగోడు, హుజూరాబాద్ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు అధికార భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి డబ్బును విపరీతంగా ఖర్చు చేశాయి. ఒక్కొక్క వోటర్ కు కోరినన్ని వరాలు ఇచ్చాయి.. ఓటుకు 5000 చొప్పున పంచాయి. ఈ ఎన్నికలు చూసే యావత్ దేశం మొత్తం ముక్కున వేలు వేసుకుంది. కానీ అంతకుమించి అనేలా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం సాగుతోంది.

ఖరీదైన ఎన్నికలుగా..

కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కుమారస్వామి పార్టీ జెడిఎస్ కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ.. టి ప్రధానంగా 50 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తుంది అనే విశ్లేషకులు అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఓట్లను చీలుస్తుందని చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కూడా ఈసారి పోటీలో ఉంది. దీని ప్రభావం మామ మాత్రమే కావచ్చు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఖర్చు మాత్రం దేశంలోనే కొత్త రికార్డు సృష్టిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఒక్కో పార్టీ అభ్యర్థి సగటున 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ఒక అంచనా. మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ సంఖ్య 70 కోట్ల వరకు చేరుతుందని సమాచారం. గత సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు అత్యంత ఖరీదైనవి గా మారిపోయాయి. ఇప్పుడు వీటన్నింటి రికార్డు కర్ణాటక బద్దలు కొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఐదు సంవత్సరాల క్రితం ఒక్కో అభ్యర్థి 20 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే సగటు కర్ణాటక రాష్ట్రంలో 50 కోట్లను అందుకుంది అనేది విశ్లేషకుల అంచనా. ఒక్కో అభ్యర్థి ఓటుకు 5000 వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. గత కొద్ది రోజుల నుంచి అభ్యర్థులు ఓటర్లను మరింత ప్రసన్నం చేసుకునేందుకు విందు, వినోదాల పేరిట భారీగా ఖర్చు చేస్తున్నారు. తిన్నోడికి తిన్నంత తిండి, తాగినోడికి తాగినంత మద్యం పోస్తున్నారు. పదిమందిని వెంట వేసుకొని వచ్చేవారికి ఒక రేటు, ప్రచారానికి తిరిగేవారికి మరొక రేటు చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు.

అవినీతికి లోటు లేదు

మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో రాజకీయ అవినీతి ఎక్కువ. నేతల కుంభకోణాలు కర్ణాటక రాష్ట్రంలో ముంజేతి కంకణమే. ఎన్నికల్లో సగటున 50 కోట్ల వరకు ఖర్చుపెట్టిన అభ్యర్థులు వాటిని ఏ రూపంలో తిరిగి వసూలు చేసుకుంటారనేది కర్ణాటక మొత్తం విధితమే. ఇప్పుడున్న బిజెపి మాత్రమే కాదు గతంలో పాలించిన కాంగ్రెస్ కూడా కుంభకోణాలతో ఇబ్బంది పడ్డదే. ఇక అక్కడ ఏ పార్టీకి కూడా సరైన ఫిగర్ రాకపోతే ఎమ్మెల్యేల కొనుగోళ్ళు, పార్టీ ఫిరాయింపులు కూడా సర్వసాధారణమే. హంగ్ ఏర్పడుతుందనే భావనతో చాలామంది ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడుతున్నారు. తో తాము పెట్టిన ఖర్చుకు ఎలాగైనా గిట్టుబాటు అవుతుందనే ధైర్యంతో ఉన్నారు.