Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతుండగా పార్లమెంట్ లో కాంగ్రెస్ ఆందోళనలు చేసింది. కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదంపై స్పందించాలని కాంగ్రెస్ ఎంపీలు బీజేపీని నిలదీశారు. దీంతో మోడీ సహనం కోల్పోయారు. కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వివిధ రాష్ట్రాల్లో 1988 నుంచి ఇప్పటిదాకా గెలవలేదని రాష్ట్రాల వారీగా లెక్క తీసి మరీ మోడీ కడిగేయడం విశేషం.

1972లో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ను గెలిపించారని.. ఒడిశాలో 27 ఏళ్ల క్రితం, నాగాలాండ్ లో 24 ఏళ్ల క్రితం.. గోవాలో 28 ఏళ్ల క్రితం గెలిపించారని మోడీ కడిగేశారు.ఇక మోడీ ప్రసంగంలో ప్రధానమైన అంశం ఏంటంటే.. ఈ క్రమంలోనే తెలంగాణను ప్రస్తావించారు.
తెలంగాణను తామే ఏర్పాటు చేశామని క్రెడిట్ తీసుకున్న కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు కూడా విశ్వసించలేదని మోడీ కడిగిపారేశారు. రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ ను గెలిపించలేదంటే దాని విశ్వసనీయత ఏ పాటిదో అర్థం చేసుకోవాలని మోడీ నిలదీశారు.
కరోనా సమయంలో కార్మికులను తరలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలపై మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కరోనా సమయంలో ఉచిత రైలు, బస్సులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల పంజాబ్, యూపీ, ఉత్తరప్రదేశ్ లో కరోనా వ్యాప్తి పెరిగిందని మోడీ విమర్శించారు. అంటే కార్మికులను తరలింపును మోడీ తప్పు పట్టడం వివాదాస్పదమైంది.








