ఈ బ్యాంకుకు భారీ మొత్తంలో ఎగవేసిన వారిలో అనిల్ అంబానీ, ఎస్ఎల్ గ్రూపు అధినేత సుభాష్ చంద్ర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి దగ్గరగా వ్యవహరించే మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా యస్ బ్యాంకు నుండి రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించడంలో విఫల మయ్యాయి. దీంతో వీరిపేర్లు ఆ బ్యాంకు నిరర్ధక ఆస్తుల జాబితాలో చోటుచేసు కున్నాయి.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఈ విషయాలను ధృవీ కరించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె ‘యస్ బ్యాంకు జారీచేసిన రుణాలు సకాలంలో వసూళ్లు కాలేదని, దీంతో బ్యాంకు తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. ఈ కారణంగానే సంక్షోభం చోటుచేసుకుంది.’ అని చెప్పారు.
మరోవైపు యస్ బ్యాంకు రుణ సామర్ధ్యం కొన్ని సంవత్సరాలుగా అనూహ్యంగా పెరగడం కూడా అనేక అనుమానాలకు దారి
తీస్తోంది. 2017వ సంవత్సరంలో ఈ బ్యాంకు రూ.1.32 లక్షల కోట్లను రుణంగా ఇవ్వగా, 2019 నాటికి ఆ మొత్తం రూ.2.41 లక్షల కోట్లకు చేరింది. అంటే, రెండు సంవత్సరాల్లో 80శాతం పెరుగుదల నమోదైంది.
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం తొలివిడత అధికారంలో వచ్చే సమయానికి (2014) యస్ బ్యాంకు ఇచ్చిన మొత్తం రుణాలు రూ.55 వేల కోట్లు మాత్రమేనని మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా మిగిలిన బ్యాంకుల రుణ సామర్ధ్యం 2014 నుండి 2019 మధ్య 10శాతం మాత్రమే పెరిగింది. ఒక్క యస్ బ్యాంకు మాత్రమే ఇంతలా తన సామర్య్ధాన్ని ఎలా పెంచుకో గలిగింది.’ అని ఆయన ప్రశ్నించారు.
రెండు, మూడేళ్లుగా ఈ బ్యాంక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మోసాలు జరుగుతున్నాయని సంకేతాలు వచ్చినప్పటికీ మోడీ సర్కార్ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.