PM Modi big announcement tomorrow: దేశవ్యాప్తంగా ప్రజలు పొదుపు పాటించాలని, ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మధ్య ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో వస్తు ధరలు పెరిగే అవకాశం ఉందని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. మే 13న ఉదయం 11 గంటలకు ప్రధాని Narendra Modi అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఇంధన వినియోగ నియంత్రణ, ధరల స్థిరీకరణ, ప్రత్యామ్నాయ విధానాలపై కీలక చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీలో మోదీ ఎలాంటి బాంబు పేలుస్తారో? అన్న చర్చ సాగుతోంది.
ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు ఇంధన పొదుపుపై ప్రత్యేక సూచనలు చేశారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు సాధ్యమైన చోట్ల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విద్యుత్, ఇంధన వినియోగంపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల బృందం మంగళవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. రవాణా వ్యవస్థ, ఆయిల్ డిపోలు, సరఫరా గొలుసు వ్యవస్థలపై సమీక్ష జరిపి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారులకు మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మారడం, దిగుమతి వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రభావం దేశీయ ధరలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో బుధవారం నాటి క్యాబినెట్ సమావేశంలో ధరల నియంత్రణకు సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు కొంతవరకు హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించే అవకాశముందనే చర్చ కూడా జరుగుతోంది. దీనివల్ల నగరాల్లో ట్రాఫిక్ తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా నియంత్రణలోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన అవసరాలు, భవిష్యత్ సరఫరా వ్యూహాల దృష్ట్యా ఈ సమావేశం కీలకంగా మారింది. ప్రజలకు భరోసా కలిగించేలా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.