Pawan Kalyan-TDP: జనసేనాని పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు.. వైసీపీ అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ ఎందుకు అంటున్నారు? తెలుగుదేశం పార్టీతో మరోసారి పొత్తుకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ ఏపీ రాజకీయాల్లో తరచుగా వచ్చేవి. వాటికి తాజాగా జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ప్రజా సేవలోనే ఉంటానని.. సమస్యలకు భయపడితే ముందుకెళ్లలేనని పవన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల పరిష్కారం కోసమే నాడు టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చానని.. పెద్దల సూచన మేరకు నాడు టీడీపీని అధికారంలోకి తేవడానికి సహకరించానని పవన్ కళ్యాణ్ అన్నారు.
2014లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చానో కూడా పవన్ కళ్యాణ్ అసలు నిజాన్ని బయటపెట్టాడు. రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు ఉంటాయని ఆలోచించి.. అనుభవం గల చంద్రబాబు అయితేనే సమస్యలు తీర్చగలడని టీడీపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు. నాడు అమరావతికి ఒప్పుకొని నేడు 3 రాజధానులు అంటున్న జగన్ కు.. చట్టాలు అమలు చేసే అధికారం ఎక్కడిది? అని ప్రశ్నించారు. అందుకే వైసీపీని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. మాట మీద నిలబడని మనుషులు ఎలా పాలిస్తారని దుయ్యబట్టారు. మాట నిలబెట్టుకోలేనప్పుడు చట్టాలు చేసే అధికారి మీకెక్కడిది అంటూ నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతోందనే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హామీలు నెరవేర్చని వారికి చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక కావాలనిపించిందన్నారు. ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే పార్టీ స్థాపించినట్లు వివరించారు. గెలిచేవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమన్నారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.