Jani Master: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలవేళ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు సినీ నటులు సైతం ఈసారి సెగలు పుట్టిస్తున్నారు. వ్యూహం సినిమాతో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న హల్చల్ ఇంతా అంతా కాదు. ఆయన దర్శకుడుగా కంటే వైసీపీ నేతగా మారిపోయారు. చంద్రబాబుతో పాటు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే ఒక్క రాంగోపాల్ వర్మ మాత్రమే కాదు. పోసాని కృష్ణ మురళి, అలీ సైతం వైసీపీకి అండగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెరపైకి రావడం విశేషం. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఆయన నెల్లూరు జిల్లాలో జరిగిన అంగన్వాడీల ఆందోళనకు హాజరు కావడం విశేషం. ఏకంగా శిబిరానికి వచ్చిన ఆయన స్వయంగా కూర్చుని నిరసన పాటు పట్టారు. ఆందోళన కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోయిన అంగన్వాడీ కార్యకర్త రమణమ్మ కుటుంబానికి రూ.70000 ఆర్థిక సహాయం అందజేశారు.
అంతటితో ఆగని జానీ మాస్టర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని ప్రకటించారని.. కానీ మాట తప్పారని విమర్శించారు. ప్రసవం తర్వాత తన భార్య ఇద్దరు బిడ్డలతో ఎంత ఇబ్బంది పడిందో తనకు తెలుసని.. అలాంటిది ఎంతోమంది బిడ్డలను ఓర్పుతో ఆదరిస్తున్న అంగన్వాడి తల్లుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ కు జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ కు పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో.. తనకు వైయస్ జగన్ అంత ఇష్టమని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలు సమీపించే కొలది పవన్ కు మద్దతుగా సినిమా రంగం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.