Mamata Banerjee: ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.. మా ఖర్మకు మీరు ఒక సీఎం.. మమతను తూర్పారబట్టిన వైద్య విద్యార్థిని తండ్రి..

కోల్ కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారం ఘటన బెంగాల్ రాష్ట్రాన్ని మాత్రమే కాదు యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదుపుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 19, 2024 8:44 am

Mamata Banerjee

Follow us on

Mamata Banerjee: కోల్ కతా లో వైద్య విద్యార్థినిపై చోటుచేసుకున్న దారుణం యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ పనితీరును కోల్ కతా హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఇంతటి దారుణం జరిగినప్పటికీ నెమ్మదిగా విచారణ జరుపుతున్న తీరును తప్పు పట్టింది. ఈ కేసులో ఇన్వాల్వ్ కావాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను కోరింది. దీంతో గత కొద్దిరోజులుగా కేంద్ర దర్యాప్తు బృందం అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. ఈ కేసు విచారణ దశలో ఉండగానే వైద్య విద్యార్థినిపై దారుణం జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపి వేసేందుకు కొంతమంది దుండగులు ప్రయత్నించారు. ఆ ఆస్పత్రిలోకి ప్రవేశించి వైద్యులపై దాడులు చేశారు. నర్సింగ్ స్టాఫ్ పై అనుచితంగా ప్రవర్తించారు. 40 మంది ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కూడా పశ్చిమబెంగాల్ పోలీసుల పనితీరును హైకోర్టు తప్పు పట్టింది. తీవ్రంగా మందలించింది. ఇక సుప్రీంకోర్టు కూడా ఈ కేసు విషయంలో ఆదివారం కీలక వ్యాఖ్యలు చేసింది. సుమోటోగా స్వీకరించి, మంగళవారం కేసును విచారిస్తామని వెల్లడించింది.

ఇది ఇలా ఉండగానే వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు స్పందించారు..” మా కుమార్తె కేసు విషయంలో కోల్ కతా పోలీసులు సరిగా స్పందించడం లేదు. వారు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉంది. మమతా బెనర్జీ పై పూర్తిస్థాయిలో నమ్మకం పోయింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం తమ వంతు ప్రయత్నం చేస్తోంది.. సిబిఐ అధికారులు మా ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మా కుమార్తె డైరీలోని ఒక పేజీని వారికి అందించాను. అందులో ఏమున్నాయనే విషయాన్ని నేను చెప్పలేనని” మృతురాలి తండ్రి ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు.

మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితురాలికి న్యాయం జరగాలని రోడ్డుమీదికి వచ్చారు. ఆందోళన చేపట్టారు. దీనిపై కూడా మృతురాలి తండ్రి స్పందించారు. ” ఈ ఘటన జరిగినప్పుడు నా గుండె పగిలిపోయింది. నా భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడంతో మాకు నమ్మకం ఉండేది. కానీ ఆ తర్వాత సన్నగిల్లడం మొదలైంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఆమెపై మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఆమె ఎందుకు విరుద్ధంగా తనకు న్యాయం చేయాలని రోడ్డుమీదికి ఎక్కారు. జరిగిన దారుణంలో నిందితులను గుర్తించి, మాకు న్యాయం చేయాల్సింది పోయి ఆమె రోడ్డు ఎక్కారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అవుతారు.. మా ఖర్మ కు ఆమె సీఎం అయ్యారని” ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

“న్యాయం చేయాలని రోడ్డుమీదికి ఎక్కిన ముఖ్యమంత్రి.. అదే మాట చెబుతున్న సామాన్యులపై మాత్రం దాడులు చేస్తున్నారు. న్యాయం కోసం ఆమె చేస్తున్న ఆందోళన సాహితికమైనదైతే.. అలానే ఆందోళన చేస్తున్న సామాన్యులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఈ దిక్కుమాలిన వైఖరి? మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన కన్యా శ్రీ పథకం, లక్ష్మీ పథకాలు పూర్తిగా నకిలీవి. ఈ పథకాలు పొందాలనుకుంటున్న మహిళలు ముందుగా క్షేమంగా ఉండాలి.. వారు తమ భద్రతను అంచనా వేసుకోవాలని” మృతురాలి తండ్రి వాపోయాడు.