Pakistan Spying On Indian Temples: కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నారు. కానీ భారత దేశంలో నేడు కాదేదీ ఉగ్రవాదానికి అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారాయి.టెక్నాలజీ పెరగడం, నిరుద్యోగం పెరగడంతో డబ్బుల కోసం మాతృభూమి రహస్యాలను కూడా అమ్ముకుంటున్నారు దేశద్రోహులు. ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం వీరిపై దృష్టిపెట్టింది. చాలా మందిని గుర్తించి పట్టుకుంది. తాజాగా రాజస్థాన్లో 29 మంది యువకులు మన రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ సీకర్లోని కాటూశ్యాం మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని 29 మంది అనుమానితులు సమాచారం సేకరించి ఉగ్రవాదులకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
మందిరం వివరాలు పాకిస్తాన్కు..
అరెస్టయిన వారి మొబైల్లలో మందిర భవనాలు, గదులు, బాత్రూమ్లు, ప్రార్థనా మండపాలు, భక్తుల రద్దీ సమయాలు, జీపీఎష్కోఆర్డినేట్లు సహా వివరణాత్మక ఫొటోలు, వీడియోలు దొరికాయి. ఢిల్లీ సనాతన ధర్మ మందిరం, నోయిడా రావణ మందిరం వంటి ఇతర ఆలయాలపై కూడా డేటా సేకరించారు. పాక్ గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టి సూచనల మేరకు ఈ చర్యలు జరిగాయని తేలింది .
ఉగ్రవాద వ్యూహం
హిందువుల వేషంలో దర్యాప్తు చేసి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పాక్లోని ఉగ్రవాదులకు సమాచారం పంపారు. ఆన్లైన్ శిక్షణ, డబ్బు మద్దతుతో పనిచేసిన ఈ స్లీపర్ సెల్లు లష్కర్, జైష్ వంటి సంస్థలతో సంబంధం కలిగి ఉండవచ్చని దర్యాప్తు సూచిస్తోంది. డబ్బు పొదుపు ప్రధాన కారణంగా నిలిచింది.
29 మందిలో ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు, మిగిలిన వారి కోసం దేశవ్యాప్త గాలిస్తున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్, సైబర్ యూనిట్లు డిజిటల్ ట్రాకింగ్ చేస్తున్నాయి. మందిర ప్రాంతంలో సీసీటీవీలు, కమాండోల డిప్లాయ్మెంట్ పెంచారు.
