ఒక వంక అంతా కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న సమయంలో భారత దేశంలో ముంబై తరహా ఉగ్రదాడులు జరపడం కోసం పాకిస్థాన్ లో కుట్ర సాగుతున్నట్లు నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. మే 10న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లష్కర్ ఎ తొయిబా ప్రతినిధులతో ఇస్లామాబాద్లోని సొంత ఫామ్ హౌస్ లో ఈ విషయమై సమావేశమైన్నట్లు తెలుస్తున్నది.
పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ బృందం కూడా పాల్గొన్న ఈ సమావేశం తర్వాత సముద్ర మార్గం గుండా గుజరాత్ లేదా మహారాష్ట్రలోకి ఆయుధాలు పంపేందుకు లష్కర్ ఎ తొయిబా యత్నాలు ప్రారంభించిన్నట్లు తెలుస్తున్నది. భారత్ కరోనా కట్టడిలో నిమగ్నమై ఉన్న సమయంలో దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నుతోంది.
లష్కర్ ఎ తొయిబా అధినేత హఫీజ్ సయీద్ ప్రోద్భలంతో ఆ సంస్థ సెకండ్ చీఫ్ అబ్దుల్ రహమాన్ మక్కీ గత వారం దావూద్తో భేటీ అయి భారత్పై దాడుల విషయంపై చర్చించాడు. దావూద్ గ్యాంగ్ సహకారంతో భారత్లోకి ఆయుధాలు చేరేలా చూడాలని ఐఎస్ఐ, లష్కర్ ఎ తొయిబా కోరాయి.
మరోవంక జమ్మూకశ్మీర్లో పారామిలటరీ బలగాలను లక్ష్యంగా చేసుకొని పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ బాంబు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జమ్మూకశ్మీర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
పారామిలటరీ బలగాలపై పాక్ ఉగ్రవాద ముష్కర మూకలు కారు బాంబు, ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని సమాచారం అందింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కొత్త కమాండరుగా ఘాజీ హైదర్ నియమించిన నేపథ్యంలో కశ్మీర్ లోయలో సైనిక బలగాలను మోహరించి అప్రమత్తం అయ్యారు.