ఏపీ సీఎం జగన్ తన ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకొని, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను ఆ ప్రాంతంలోకి రానివ్వకుండా చేసి, సామాన్యుడికి దూరమయ్యాడని టీడీపీ నేత పట్టాభిరాం ఆరోపించారు. ప్రజావేదిక కూల్చి గురువారం నాటికి ఏడాది అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ గేట్లు సామాన్యుడికి ఏ రోజైనా తెరిచారా? అని ప్రశ్నించారు. ఒక్క సామాన్యుడైనా ఆ ప్యాలెస్ లోకి వెళ్లగలిగాడా? అని అన్నారు. ఆ రోజున ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు స్వతంత్ర్యంగా వెళ్లి చంద్రబాబును కలిసేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పట్టాభిరాం విమర్శించారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజావేదిక కూల్చివేత ఏడాది సందర్బంగా ఒక ట్వీట్ చేశారు. “ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చడం ఒక బాధ్యతా రాహిత్యమైన చర్య. ఆ శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచడం ఒక ఉన్మాద చర్య. నాటి విధ్వంసానికి, మీ ప్రభుత్వ ఉన్మాద పాలన ప్రారంభానికి ఏడాది అయిన సందర్భంగా తెలుగుదేశం నేతలు మీ చర్యలను ప్రజల దృష్టికి తెస్తుంటే ఉలికి పడుతున్నారెందుకు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇలా మొదలై అలా ముగిసిన ప్రజావేధిక!
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానిని అమరావతికి తరలించిన తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమావేశ మందిరం లేకపోవడంతో ప్రైవేట హోటళ్లలో సమావేశాలు నిర్వహించేవారు. ప్రభుత్వానికి ఒక సమావేశ మందిరం ఉండాలంటూ 2017లో ప్రజావేదిక పేరుతో గ్రీవెన్స్ హాల్ నిర్మించారు.
చంద్రబాబు సీఎంగా ఉండగా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు, ఇతర సమావేశాలు ప్రజావేదికలోనే నిర్వహించారు. టీడీపీ కార్యకలాపాలకు కూడా ప్రజావేదిక కేంద్ర స్థానంగా ఉండేది. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తర్వాత కూడా టీడీపీ కార్యకలాపాలన్నీ ప్రజావేదిక నుంచే జరిగాయి. టీడీపీ కార్యక్రమాలకు అధికారిక భవనం వినియోగించడంపై వైసీపీ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సమావేశాలను ప్రజావేదికలో నిర్వహించడాన్ని తప్పుపడుతూ.. వచ్చింది. ఈ క్రమంలో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత “అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రజావేదిక భవనం నుంచే మొదలుపెడుతున్నాం” అని జగన్ ప్రకటించి, 2019 జూన్ 25న కూల్చివేశారు.