భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు.
ఈ మేరకు సీజే బోబ్డే కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ అటు నుంచి ఇటు హోంశాఖకు పంపనుంది.
హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.
జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ బోబ్డే తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమణనే. 1957 ఆగస్టు 27న ఏపీలోని కృష్ణ జిల్లాలో జన్మించారు. 1983లో న్యాయవాదిగగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతిపై 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.