కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రంగాలూ నిలదొక్కుకున్నాయి. కానీ.. ఇప్పటికీ కుదుట పడని రంగం ఏదైనా ఉందంటే.. అది సినీ పరిశ్రమ మాత్రమే. ఎప్పుడో పూర్తిచేసిన సినిమాలు ఇప్పటికీ విడుదల కావట్లేదు. గత సమ్మర్ లో విడుదల కావాల్సిన చిత్రాలన్నీ.. స్టోర్ రూమ్ లోనే మూలుగుతున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం ఏపీలో అనుకూలమైన పరిస్థితులు లేకపోవడమే ప్రధాన కారణం.
ఇప్పటికీ అక్కడ నాలుగు షోలు వేయడానికి అనుమతి లేదు. టికెట్లు కూడా 50 శాతమే విక్రయించాలి. ఇక, వాటి ధరలు అమాంతం తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పదేళ్లనాటి ధరలకు తాము థియేటర్లు రన్ చేయలేమంటూ ఎగ్జిబిటర్లు తెరవట్లేదు. ఈ కారణాలతో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్లో టికెట్లు తామే విక్రయిస్తామంటూ ప్రకటించింది ఏపీ సర్కారు. ఈ విధంగా.. ఆంధ్రప్రదేశ్ లో అన్నీ సమస్యలే ఉన్నాయని నిట్టూరుస్తున్నారు సగటు సినీ జనాలు.
ఇలాంటి పరిస్థితుల్లో.. రిపబ్లిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సినిమా ఇండస్ట్రీని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని కొందరు అంటున్నారన్న పవన్.. అదేం పుణ్యానికి వచ్చింది కాదన్నారు. ఎక్కడా దోపిడీ చేసేది కాదన్నారు. ఒళ్లు హూనం చేసుకొని, డ్యాన్సులు, ఫైట్లు చేస్తే వచ్చే సొమ్ము అన్నారు. అందులోనూ భారీగా ప్రభుత్వానికి పన్ను కడుతున్నట్టు గుర్తు చేశారు. కొందరు రాజకీయ నాయకుల్లాగా పన్నులు ఎగ్గొట్టి, అవినీతికి పాల్పడి దోచుకుంటున్నది కాదని అన్నారు.
ఈ విధంగా అటు హీరోల గురించి, ఇటు నిర్మాతల పరిస్థితి గురించి తనదైన పద్ధతిలో ప్రసంగించారు పవన్. అయితే.. ఈ విషయమై స్టార్ హీరోలెవ్వరూ మద్దతుగా నిలవకపోవడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టార్లుగా చెప్పుకునే వారంతా.. ఇలాంటి సమయంలో స్పందించకపోతే ఇంకెప్పుడు మాట్లాడుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అయితే.. పవన్ వ్యక్తిగత ప్రయోజనం కోసం మాట్లాడారని ప్రత్యర్థులు చేసే ఆరోపణలపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ చెప్పిన దాంట్లో తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో నెలకొన్న వాస్తవ పరిస్థితినే కదా ఆయన చెప్పింది? అది వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడి అందరూ నోరు మూసుకుని ఉన్నారని, పవన్ మాత్రమే ధైర్యంగా ప్రశ్నించారని అంటున్నారు. మరి, ఇలాంటి సమయంలోనూ ఏకతాటిపైకి రాని కళామతల్లి బిడ్డలు.. ఇంకెప్పుడు ఏకమవుతారు? వేదికల మీద గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఒక్కటవుతారా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.