
Vasalamarri Village: “ఊరంటే గిట్ల ఉంటదా? పాడుబడ్డ ఇండ్లు, బీడుబడ్డ పొలాలు? ఇట్ల కాదు.. మనం దీన్ని మార్చాలే. వాసాల మర్రి ని బంగారు మర్రి చేయాలే” ఇదీ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు.. ఈ మాటలు చెప్పి రెండేళ్లు గడిచిపోయాయి.. ఇప్పటికీ ఊదు కాలింది లేదు. పీరి లేచింది లేదు.. ఇన్ని రోజులపాటు ఊహల్లో విహరించిన వాసాలమర్రి ప్రజలకు చివరకు నిరాశ తప్పడం లేదు.
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాల మర్రి గ్రామాన్ని 2020 నవంబర్లో సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న పది నెలల తర్వాత 2021 ఆగస్టులో అందరికీ కొత్తగా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 17 నెలల పాటు కాలం వెల్లబుచ్చారు. దీంతో అక్కడ గ్రామపంచాయతీ కూడా కొత్త ఇంటి పర్మిషన్లను నిలిపివేసింది. దీంతో మీడియాలో వరుస కథనాలు రావడంతో చివరికి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొత్తగా ఉన్న నిర్మాణాలను వదిలిపెట్టి మిగిలిన వారికి ఇండ్లను నిర్మించి ఇస్తామని వాసాల మర్రి గ్రామంలో గత నెల 24న జిల్లా అధికారులు గ్రామసభ నిర్వహించి ప్రకటించారు. ఇందుకుగాను ఇంటి స్థలాలను గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగించాలని షరతు పెట్టారు. అగ్రిమెంట్ ఎలా ఉండాలో కూడా ఒక ప్రింట్ అవుట్ కాపీ పంచాయతీలో ఇచ్చారు. గ్రామసభ నిర్వహించి 20 రోజులు గడిచింది. అధికారులు చెప్పిన దాని ప్రకారం గ్రామంలో 303 ఇళ్ళు తొలగించాల్సి ఉంది. ఈ ఇళ్లకు సంబంధించిన యజమానులు ఎవరు ఇప్పటివరకూ తమ ఇంటి స్థలాలను గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగిస్తున్నట్టు అగ్రిమెంట్ ఇవ్వలేదు.

300 ఇండ్ల నిర్మాణానికి నిర్ణయం సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నందున తమ దశ తిరుగుతుందని గ్రామస్తులు అప్పట్లో భావించారు. మొదట ఈ గ్రామంలోనే దళిత బంధు అమలు చేయడంతో వారి నమ్మకం మరింత పెరిగింది. అయితే వారి ఆశలు తలకిందులయ్యే నిర్ణయం జరిగింది. ప్రస్తుతం గ్రామానికి చెందిన 34.08 ఎకరాల్లో నాలుగు ప్రధాన రోడ్లు, ఇళ్ళ మధ్య 30 లింక్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్కులు, ఫంక్షన్ హాల్ సహ ఇతర అవసరాల కోసం మరో 1.16 ఎకరాలు కేటాయించారు. కొత్తగా ఉన్న 103 ఇళ్ళూ పోనూ చెప్పినట్టుగా 303 ఇళ్ళు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొన్ని జి ప్లస్ వన్ ఇళ్ళు కూడా ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి 200 గజాల స్థలం కేటాయించేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా వేస్తున్న రోడ్ల విస్తరణకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెట్ బ్యాక్ లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే లబ్ధిదారులకు డబుల్ ఇండ్లను నిర్మించాలని ప్రపోజల్స్ పెట్టారు. ఒక్కో ఇంటిని 58 గజాల్లో నిర్మించాలని, లేకుంటే 77 గజాలకు మించకుండా నిర్మించాలని ప్రపోజల్స్ లో చేర్చారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇక 20 లక్షలతో కొత్తగా నిర్మించాలని భావించిన వాసాలమర్రి పంచాయతీ భవన నిర్మాణానికి కూడా ఆటంకం ఎదురైంది. కూల్చివేసిన హాస్టల్ భవనం స్థలంలో కాకుండా ప్రస్తుతం ఉన్న పంచాయతీ భవనం స్థానంలోనే నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా నిర్మించే ఇళ్ల కోసం తయారుచేసిన లేఅవుట్ ప్రకారం ప్రస్తుతం పంచాయతీ నిర్మించాలనుకుంటున్న స్థానంలో రోడ్డు రావాల్సి ఉంది. ఈ అభ్యంతరంతో పంచాయతీ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టకముందే నిలిచిపోయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాలని నిర్ణయం వెనుక ఖర్చు తగ్గించాలని ఉద్దేశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. వాసాలమర్రి అభివృద్ధి కోసం గత ఏడావిజ్యులైలో 150 కోట్ల నుంచి 165 కోట్లతో డిపిఆర్ రూపొందించగా.. అది ఇప్పుడు 60 కోట్లకు తగ్గింది. ఇందులో భాగంగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించేందుకు అంచనాలు రూపొందించారని తెలుస్తోంది. కెసిఆర్ తమకు హామీ ఇచ్చారని.. కానీ ఇంతవరకు నెరవేర్చలేదని గ్రామస్తులు అంటున్నారు.. ఇటు ప్రభుత్వం ఆదుకోక..
తమనూ ఇళ్ళను నిర్మించుకోనియక ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోతున్నారు.