FCRA Amendment Bill 2026: స్వచ్ఛంద సంస్థలు దేశంలో అనేకం ఉన్నాయి. కొన్ని రైతుల కోసం, కొన్ని వృద్ధుల కోసం, కొన్ని అనాథల కోసం, కొన్ని పేదల కోసం, కొన్ని దివ్యాంగుల కోసం.. క్యాన్సర్స్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం అంటూ పనిచేస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని సంస్థలు విదేశాల నుంచి నిధులు పొందుతున్నాయి. ఇంతకాలం వీటిపై నియంత్రణ పెద్దగా లేదు. అయితే ఇకపై అలా ఉండదు. విదేశాల నుంచి వచ్చే డబ్బులకు ఇకపై లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఈమేరకు కేంద్రం విదేశీ సహకారం (నియంత్రణ) సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది.
కొత్త నిబంధనలు ఏమిటి?
రద్దు చేయబడిన లైసెన్సుల ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఇది ఈ బిల్లులో అత్యంత కీలకమైన అంశం. ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేయబడిన, సస్పెండ్ చేయబడిన, స్వచ్ఛందంగా అప్పగించబడిన లేదా గడువు ముగిసిన సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని, నిర్వహించడానికి ఒక చట్టబద్ధమైన యంత్రాంగం ఏర్పాటు చేయబడుతుంది. ఒక నియమిత అథారిటీ ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటి రికార్డులు, జాబితాలను నిర్వహించి, చట్టబద్ధంగా ఉపయోగించడం లేదా విక్రయించడం చేయగలదు.
విదేశీ నిధుల స్వీకరణ, వినియోగానికి పరిమితులు
ప్రభుత్వం విదేశీ నిధులను స్వీకరించడానికి వాలిడిటీ పీరియడ్, వాటిని వినియోగించడానికి సమయ పరిమితులను విధిస్తుంది. ఇది నిధులు ఎక్కువ కాలం ఉండిపోవడం లేదా దుర్వినియోగం కావడం నివారించడానికి ఉద్దేశించబడింది. ఎఫ్సీఆర్ఏ కింద ఏదైనా క్రిమినల్ విచారణ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఇది అనవసరమైన వేధింపులు నివారించడానికి ఉద్దేశించబడిందని ప్రభుత్వం చెబుతోంది .
ఎవరిపై ప్రభావం పడుతుంది?
భారత్లో ప్రస్తుతం సుమారు 16 వేల సంస్థలు ఎఫ్సీఆర్ఏ నమోదు కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు ఏటా సుమారు రూ.22 వేల కోట్ల విదేశీ నిధులను స్వీకరిస్తున్నాయి. గత కొన్నేళ్లలో వేలాది సంస్థల ఎస్సీఆర్ఏ లైసెన్స్లు రద్దు చేయబడ్డాయి. వారి ఆస్తుల భవిష్యత్తు ఇప్పుడు స్పష్టమవుతోంది.
ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటి?
విదేశీ నిధులు జాతీయ భద్రతకు లేదా ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించకుండా చూడటం. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, ఖాతాదారీతనం పెంచడం, రద్దు చేయబడిన సంస్థల ఆస్తుల భవిష్యత్తుపై స్పష్టత కల్పించడం.: చిన్న ఉల్లంఘనలకు అతి కఠినమైన శిక్షలు నివారించడం.
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు విదేశీ నిధులు స్వీకరించే సంస్థలపై ప్రభుత్వ నియంత్రణను మరింత బలోపేతం చేస్తోంది. రద్దు చేయబడిన సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం, విదేశీ నిధుల వినియోగానికి సమయ పరిమితులు, జాతీయ భద్రత, పారదర్శకత, సార్వభౌమాధికార రక్షణకు అవసరమైన చర్యగా ప్రభుత్వం భావిస్తోంది.