ఎల్గర్ పరిషద్- బీమా కొరెగావ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయిత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ముంబయిలోని ప్రత్యేక కోర్టు కోరింది. రెండు రోజుల క్రితం తలోజా సెంట్రల్ జైలు గదిలో అపస్మారకస్థితిలో ఉన్న ఆయనను అధికారులు జెజె ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఆయన తాత్కాలిక బెయిల్ పిటిషన్పై జూన్ 2న విచారణ చేపడతామని పేర్కొంది. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని జెజె ఆస్పత్రి డీన్ డా. రంజిత్ మంకేశ్వర్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆయనతో వీడియో కాల్లో మాట్లాడే అవకాశం కల్పించాలంటూ కేంద్ర, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ వరవరరావు భార్య పి. హేమలత ఒక ప్రకటనను విడుదల చేశారు.
కల్పిత ఆరోపణలపై ఎటువంటి విచారణ లేకుండా 18 నెలల శిక్ష అనుభవించారని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, బెయిల్ కోసం జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్డడిఎ)ను కేంద్ర హోంశాఖ ఆదేశించాలని ఆమె కోరారు.
ఇలా ఉండగా తన తండ్రికి వెంటనే తాత్కాలిక బెయిల్ ఇచ్చి జైలు నుండి విడుదల చేయాలనీ ఆయన కుమార్తె పవన్ డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి చొరవ తీసుకొని బెయిల్ ఇప్పించాలని ఆమె కోరారు.
కోర్ట్ అనుమతి కోసం పిటిషన్ వేశామని చెబుతూ, కోర్ట్ అనుమతిస్తే ముంబై వెళ్లి తండ్రిని కలుస్తామని ఆమె చెప్పారు.