Pilli Subhash Chandra Bose
Pilli Subhash Chandra Bose: వైసీపీలో మరో ఎంపీ రెబల్ గా మారనున్నారా? హైకమాండ్ కు వీర విధేయత చూపినా పెద్దలు పట్టించుకోవడం లేదా? అందుకే అధిష్టానానికి ఝలక్ ఇచ్చేందుకు సదరు ఎంపీ డిసైడయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి.ఇంతకీ సదరు ఎంపీ ఎవరంటే పిల్లి సుభాష్ చంద్రబోస్. 2012లో మంత్రి పదవి వదులుకొని మరీ జగన్ వెంట నడిచారు. కానీ అప్పట్లో ఉప ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. తరువాత రెండు ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. ప్రస్తుతం చేతిలో రాజ్యసభ ఉన్నా ఎందుకీ పనికి రాకుండాపోయిందని బోస్ లోలోన రగిలిపోతున్నారు. హైకమాండ్ సైతం తన గోడు పట్టించుకోకపోవడంతో రగిలిపోతున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలో జగన్ కు అత్యంత సన్నిహితుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. జగన్ వెంట నడిచిన తొలి తరం నాయకుల్లో ఈయన కూడా ఒకడు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా వదులుకొని జగన్ గూటికి చేరారు. కానీ అప్పట్లో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీచేసిన వారు దాదాపు గెలిచారు. కానీ బోస్ నెగ్గలేకపోయారు. 2014 ఎన్నికల్లో సొం నియోజకవర్గం రామచంద్రాపురం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసినా ఫలితం లేకపోయింది. దీంతో జగన్ బోస్ సేవలను గుర్తుచేసుకొని మంత్రిని చేశారు. కొద్దిరోజులకే రాజ్యసభ పదవి కట్టబెట్టి ఢిల్లీకి పంపించారు.
అయితే జగన్ గుర్తింపు ఇచ్చినా తరువాత పరిణామాలు మారిపోయాయి. బోస్ వదులుకున్న మంత్రి పదవిని అదే సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు అప్పగించారు. వేణుగోపాలక్రిష్ణ రామచంద్రాపురం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో బోస్ వర్గాన్ని ఎంతలా అణచివేయాలో అంతలా తొక్కేస్తున్నారు. విషయం గ్రహించిన బోస్ హైకమాండ్ పెద్దలకు ఫిర్యాదుచేశారు. కానీ అంతా లైట్ తీసుకున్నారు. నీకు రాజ్యసభ పదవే ఎక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో బోస్ లో అంతర్మథనం ప్రారంభమైంది. ఇంత విధేయత చూపిస్తే ఇదా ఫలితం అని లోలోన రగిలిపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న బోస్ పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం మానేశారు.
వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణకు గట్టి షాకివ్వాలని బోస్ భావిస్తున్నారు. కుమారుడు సూర్యప్రకాష్ ను బరిలో దించాలని భావిస్తున్నారు. కుదిరితే వైసీపీ అభ్యర్థిగా.. కుదరకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పెట్టడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మొన్న వైఎస్సార్ జయంతి నాడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రామచంద్రాపురం నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగితే..ఐదు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడాన్ని కేస్ స్టడీస్ గా భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో దూకుడు పెంచారు. శనివారం ఏకంగా రెండు వేల మందితో భారీ బహిరంగసభ నిర్వహించారు. వైసీపీ టిక్కెట్ గురించి ప్రయత్నిద్దామని.. లేకుంటే మాత్రం సూర్యప్రకాష్ ను ఇండిపెండెంట్ పోటీచేయిద్దామని బాహటంగానే బోస్ వర్గీయులు ప్రకటించారు.