రఘురామ ఈ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఏంటనే చర్చ ఎప్పుడో మొదలైంది. ఎంతగా చెలరేగిపోతున్నా.. జగన్ మౌనంగా ఉన్నాడేంటనే చర్చ కూడా వైసీపీలో స్టార్ట్ అయ్యింది. అయితే.. ఆ మౌనానికి కారణం ఏంటో ఇప్పుడు అర్థమైందని అంటున్నారు పలువురు వైసీపీ నేతలు. ప్రభుత్వం అదును కోసం వేచి చూసిందని, అవకాశం దొరకగానే సీఐడీని రంగంలోకి దించిందని చెబుతున్నారు.
సంవత్సర కాలంగా ఎంపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం మౌనం వహించింది. రఘురామరాజు విమర్శలు చేసినప్పటికీ.. వైసీపీ నాయకుల నుంచి కూడా పెద్దగా కౌంటర్లు రాలేదు. దీనికి కారణం.. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలేనని సమాచారం. ఎంతగా పైకి ఎగసినా.. మౌనంగా ఉండాలని చెప్పినట్టు సమాచారం. అందుకే.. ఆయన ఎంత పెద్ద మాటలు అన్నప్పటికీ.. ఎవ్వరూ నోరు మెదపలేదని అంటున్నారు.
జగన్ ఎందుకు మౌనంగా ఉండమన్నాడనే విషయం ఈ అరెస్టుతో అర్థమైందంటున్నారు ఆ పార్టీలోని పలువురు నేతలు. ప్రతీ మాటను గుర్తుంచుకున్నాడని, దానికి బదులు చెప్పడానికే ఈ అరెస్టు అని అంటున్నారు. మరికొందరైతే.. ఇది ఎప్పుడో జరగాల్సిందని, జగన్ వేచి చూడడం వల్లే ఇంత ఆలస్యమైందని చెబుతున్నారు.
అయితే.. ఇది కేవలం రఘురామకు సంబంధించిన అరెస్టు మాత్రమే కాదని, ఈ చర్య ద్వారా పార్టీలోని అసంతృప్తులకు, రెబల్ గా మారే ఉద్దేశం ఉన్నవాళ్లకు ఒక హెచ్చరికగానే చేశారని అంటున్నారు. పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కొందరు మాజీ మంత్రులు కూడా విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అందరికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అరెస్టు జరిగిందని అంటున్నారు.
కాగా.. విపక్షాలు మాత్రం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇది పార్టీ సొంత వ్యవహారం అనడానికి లేదని అంటున్నాయి. ఎంపీ అంటే అందరికీ ప్రజాప్రతినిధి అని, అలాంటి వ్యక్తిపై ఇలా కక్షసాధింపు చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఏ మాత్రం సరికాదని దుయ్యబడుతున్నాయి.