Modi Railway Line Inauguration: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇందులో ప్రధానమైనది సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ కాజీపేట రైల్వే మార్గంలోని మూడవ లైను. ఈ లైన్ కు సంబంధించి ఎలక్ట్రిసిటీ పనులు దాదాపు పూర్తయ్యాయి.
1952 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. 219 కిలోమీటర్ల దూరమున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 194 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. డోర్నకల్, మహబూబాబాద్ మధ్యలో ఉన్న 25 కిలోమీటర్ల సంబంధించిన పనులు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చాయి. మరో రెండు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయి.. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్, కాజీపేట, వరంగల్ ప్రాంతాల నుంచి విజయవాడకు వెళుతున్న రైలు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ మార్గం మీదుగానే దక్షిణాది రాష్ట్రాలకు సరకు రవాణా చేస్తుంటారు. అటు ప్రయాణికులు.. ఇటు సరుకు రవాణా మొత్తం ఈ మార్గం మీదుగా సాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది.
నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ పనులు దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకంగా ఉన్నాయి. గ్రాండ్ ట్రంక్ ట్రైన్ అనే ట్రైన్ ఈ రూట్ మీదుగానే వెళుతూ ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఒత్తిడి తగ్గించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది.. విష్ణుపురం, జాన్ పహాడ్ వంటి ప్రాంతాల్లో ఏర్పాటైన పరిశ్రమల నుంచి సిమెంట్ ను సులభంగా ఈ మార్గం నుంచి రవాణా చేయడానికి అవకాశం ఉంటుంది.
విజయవాడతోపాటు కాజీపేట మధ్యలో బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్ లు, సిమెంట్ పరిశ్రమలకు అనుసంధాన వ్యవస్థను పెంచుతూ ఉంటుంది.
కాజీపేట నుంచి మొదలుపెడితే బళ్లార్ షా వైపు వచ్చే అత్యంత భారీ సరుకు రైళ్లను.. అదనపు మార్గం ద్వారా ఇటువంటి ఇబ్బందులు లేకుండా నడపవచ్చు. దీనివల్ల ప్రయాణికుల రైళ్లు ఒత్తిడి లేకుండానే సాగిపోతూ ఉంటాయి.
ఈ మార్గం మీదుగా తెలంగాణ, విజయవాడ, చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్ కతా వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు జర్నీ టైం తగ్గుతుంది. తిరుపతి, చెన్నై వెళ్లే ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అదనపు రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది.
విజయవాడ తో పాటు కాజీపేట మార్గంలో 118 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మూడవ లైను అనేక దశల్లో నిర్మాణమైంది. ఈ ట్రాక్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో జాతికి అంకితం ఇచ్చారు.