లాక్‌డౌన్ పొడిగింపు తధ్యం… ప్రధాని మోదీ సంకేతం

ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్ ను పొడిగించడం అనివార్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇప్పటి వరకు దీనిని తొలగించమని తనకు ఎవ్వరు సూచించలేదని చెబుతూ ఒకే సారి తొలగించడం కూడా జరగదని కూడా స్పష్టం చేశారు. దశల వారీగా సడలించే అవకాశం ఉంటుందని సూచించారు. పార్లమెంట్ లోని వివిధ పక్షాల నేతలతో బుధవారం జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నెల 11న ముఖ్యమంత్రులతో జరుపనున్న వీడియో కాన్ఫరెన్స్ లో […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 6:37 pm
Follow us on

ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్ ను పొడిగించడం అనివార్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇప్పటి వరకు దీనిని తొలగించమని తనకు ఎవ్వరు సూచించలేదని చెబుతూ ఒకే సారి తొలగించడం కూడా జరగదని కూడా స్పష్టం చేశారు. దశల వారీగా సడలించే అవకాశం ఉంటుందని సూచించారు.

పార్లమెంట్ లోని వివిధ పక్షాల నేతలతో బుధవారం జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నెల 11న ముఖ్యమంత్రులతో జరుపనున్న వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవచ్చని సంకేతం ఇచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే ఏకైక పరిష్కారమని మోదీ స్పష్ట చేసిన్నట్లు తెలుస్తుంది.

‘‘ప్రజల ప్రాణ రక్షణకై లాక్‌డౌనే పరిష్కారం. నేను ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల సీఎంలతో, నిపుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరూ అభిప్రాయపడలేదు. మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతా. ఇప్పటి వరకైతే మొత్తానికి మొత్తం లాక్‌డౌన్ ఎత్తేయడం సాధ్యం కాకపోవచ్చు” అని చెప్పారు.

“జిల్లా అధికారులతో కూడా మాట్లాడుతున్నాము. సామాజిక దూరం పాటించే విషయంలో మనం మరింత కఠినంగా ఉండాల్సిందే. మున్ముందు మరిన్ని ఊహించని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు’’ అని మోదీ సూచించారు.

కాగా వనరుల విషయంలో తీవ్రమైన వత్తిడులు ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన దేశాలలో భారత్ ఒకటని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రజల సహకారంతో ఈ ప్రాణాంతక వైరస్ పై దేశం విజయవంతంగా పోరాటం జరపగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అందిస్తున్న సహకారం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ సవాల్ ను ఎదుర్కోవడానికి చాలా అవసరమని కూడా పేర్కొన్నారు.

దేశంలో పరిస్థితి సామాజిక అత్యవసర పరిస్థితికి సమానంగా కనిపిస్తోందని, మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని, మరింత జాగరూకతతో వ్యవహారించాల్సి ఉందని అఖిలపక్ష నేతలో మోదీ పేర్కొన్నట్లు తెలుస్తున్నది.

ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని, కరోనాకు ముందు పరిస్థితి, తర్వాత పరిస్థితి అన్నట్లుగా మారుతుందని ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.