PM Modi: భారత ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రమాణం చేసిన మరుసటి రోజే మోదీ తన బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకం రైతులకు సంబంధించిన ఫైల్పైనే చేశారు. దీంతో రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమకానున్నాయి. రైతులకు పంటసాయం అందించే.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధిదారులకు నిధుల విడుదల దస్త్రాలపైనే తొలి సంతకం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా మోదీ ‘రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే రైతుల సంక్షేమం కోసమే తొలి సంతకం చేయాలనుకున్నా. రాబోయే కాలంలో రైతుల కోసం, వ్యవసాయ రంగం బలోపేతం కోసం మరింత కృషి చేస్తాం’ అని ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో దేశంలో 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 17వ విడత సాయం కింద రూ.20 వేల క ఓట్లు జమ కానున్నాయి.
పీఎం కిసాన్ స్కీమ్
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వ పథకం. ఐదు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల కోసం దీనిని ప్రకటించారు. ఈ పథకంంలో దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పంట సాయం కింద ఏటా రూ. 6 వేలు అందిస్తుంది. ప్రతీ 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేల చొప్పున అకౌంట్లలో నేరుగా కేంద్రం జమ చేస్తుంది. ఇప్పటివరకు 16 విడతల్లో సాయం అందించింది. ఇప్పుడు 17వ విడత నిధులను మోదీ బాధ్యతలు చేపట్టిన రోజే పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్పై సంతకం చేశారు.
ఇలా చెక్ చేసుకోవచ్చు..
పీఎం కిసాన్ లబ్ధిదారులు ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో ఇలా తెలుసుకోవచ్చు.
– మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
– బెనిఫిషియరీ స్టేటస్ పేజీపై క్లిక్ చేయాలి.
– బెనిఫిషియరీ స్టేటస్లో ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి.
– తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ కూడా అక్కడే చెక్ చేసుకోవచ్చు.
కేవైసీ చేసుకుంటేనే..
పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రైతులు కచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా.. మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ ఆధారిత ఇ–కేవైసీ చేసుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు.