Mobile Data Price India: పెట్రోల్ ధరలు పెరిగాయని, డీజిల్ ధరలు పెరిగాయిని, గ్యాస్ ధరలు పెరిగాయని, కంరెటు చార్జీలు పెరిగాయని, బస్సు చార్జీలు పెరిగాయని వామపక్ష పార్టీలు, విపక్షాలు ఆందోళనలు చేయడం సహజం. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్రో, గ్యాస్ ధరలపైనే విపక్షాలు ఎక్కువగా ఆందోళన చేశాయి. అయితే ధరలు తగ్గినప్పుడు మాత్రం ఎవరూ స్వాగతించరు. అయితే రోజురోజుకు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. కానీ 12 ఏళ్లలో అనూహ్యంగా ఒకదాని ధర 97 శాతం తగ్గింది. అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందే మొబైల్ డేటా.
డిజిటల్ రంగంలో అపూర్వ విజయం..
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రంగంలో సాధించిన అపూర్వ విజయాన్ని వెల్లడించింది. 2014లో 1 గిగాబైట్(జీబీ) డేటా ధర రూ.269 ఉంటే, ప్రస్తుతం అది కేవలం రూ.9.2కి తగ్గింది. అంటే గత 4,399 రోజుల్లో (సుమారు 12 ఏళ్లలో) డేటా ధరలో 97 శాతం తగ్గుదల నమోదైంది.
ఇది భారత్ డిజిటల్ చరిత్రలో ఒక మైలురాయి. ఈ అద్భుత మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం నిరంతరం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం, భారత్నెట్ ప్రాజెక్ట్, ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, పోటీతత్వం ప్రోత్సాహం, 2016లో రిలయన్స్ జియో ప్రవేశం వంటి అనేక అంశాలు కలిసి ఈ ధరల తగ్గుదలకు దోహదపడ్డాయి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను విస్తరించడం, స్పెక్ట్రం అలాట్మెంట్లో పారదర్శకత, 5జీ సేవల వేగవంతమైన రోల్అవుట్ వంటి చర్యలు డేటా సరఫరాను భారీగా పెంచి, ధరలను తగ్గించాయి.
సామాన్యుల జీవితాలపై ప్రభావం..
ఈ చౌక డేటా ధరల వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులు, విద్యార్థులు, రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలు, గ్రామీణ యువతకు అధునాతన ఇంటర్నెట్ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. విద్యా రంగంలో ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్
ఆరోగ్య రంగంలో టెలి మెడిసిన్ సేవలు, ఆర్థిక రంగంలో యూపీఐ, డిజిటల్ బ్యాంకింగ్, చిన్న వ్యాపారాలు ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్తంగా మార్కెట్ను చేరుకోవడానికి చౌక డేటా ధరలు ప్రధాన ఆధారం అయ్యాయి.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలు కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. నాణ్యతతోపాటు చౌకదనం కలిపి ఇంటర్నెట్ను సామాన్యుని జేబులోకి తీసుకువచ్చిన దేశంగా భారత్ ప్రపంచం ముందు నిలుస్తోంది. మోదీ పాలనలో డేటా ధరల్లో వచ్చిన ఈ భారీ తగ్గుదల కోట్లాది భారతీయుల జీవన విధానాన్ని, అవకాశాలను మార్చిన నిజమైన డిజిటల్ విప్లవం. చౌకైన, నాణ్యమైన ఇంటర్నెట్ దేశంలోని చివరి వ్యక్తి వరకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్రయాణం భారత్ను ప్రపంచ డిజిటల్ శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

