Malla Reddy
Malla Reddy: మల్లన్న.. మంత్రి మల్లన్న.. యాదికి కాలేదా.. ‘‘పూలమ్మిన.. పాలమ్మిన.. బోర్వెల్ నడిపిన.. కాలేజీలు వెట్టి.. ఇంజినీర్లను తయారు చేసిన.. డాక్టర్లను తయారు చేసిన..’’ ఇప్పుడు గొర్తొచ్చిందా.. హా.. చేమకుర మల్లారెడ్డి. యస్.. ఆయన గురించే.. ఆయన ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంమైంది. ఇందతా ఒక ఎత్తయితే.. ఎన్నికల అధికారులు పొరపాటును గుర్తించకపోవడం మరో చర్చకు దారితీసింది. సామాన్యులు కూడా ఈసీని ప్రశ్నిస్తున్నారు.
మేడ్చల్ నుంచి నామినేషన్..
మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడ్చల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరూ ఆస్తులు, చదువు, నేరాలు, కేసుల గురించి అఫిడవిట్ సమర్పించారు. ఆ అఫిడవిట్ను ఈసీ ఆన్లైన్లో పెట్టింది. ఆయన ఆన్లైన్ అఫిడవిట్ కోసం తెలంగాణ యువకులు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఇలా ఓ యువతి కూడా మల్లారెడ్డి అఫిడవిట్ సాధించింది. ఒక్కటి కాదు.. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన వేసిన మూడు నామినేషన్ల అఫిడవిట్లు సేకరించింది. అందులో మల్లారెడ్డి పేర్కొన్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
ఒకే ఏడాది మూడు కాలేజీల్లో ఇంటర్..
మల్లారెడ్డి 2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసి గెలిచారు. నాడు సమర్పించిన అఫిడవిట్లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినట్లు పేర్కొన్నారు. తర్వాత 2018లో బీఆర్ఎస్ తరఫున మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వెస్లీ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివినట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ రెండూ తప్పు ప్రింట్ అనుకుంటే.. తాజాగా 2023లో బీఆర్ఎస్ నుంచే మళ్లీ మేడ్చల్ నుంచే పోటీ చేస్తున్నారు. ఇటీవల నామినేషన్ వేశారు. ఇందులో రాఘవ లక్ష్మీనర్సింహ కాలేజీలో ఇంటర్ చదివినట్లు పేర్కొన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. మూడు కాలేజీల్లో ఇంటర్ చదివింది 1973లోనే కావడం విశేషం.
ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నట్లు..
మంత్రిగా ఉండి, వ్యాపార వేత్తగా, కిందస్థాయి నుంచి వచ్చిన నేతగా చెప్పుకునే మల్లారెడ్డి వేసిన నామినేషన్లో మూడు అఫిడవిట్లలో మూడు రకాలుగా సమాచారం ఉంది. ఈ విషయాన్ని గమనించాల్సిన ఎన్నికల అధికారులు తప్పులను గుర్తించలేదు. స్క్రూటినీలో అన్నీ సరిగానే ఉన్నట్లు రైట్ కొట్టేశారు. దీంతో ఇప్పుడు ఎన్నికల అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ పొరపాటు ఉన్నా తిరస్కరిస్తామని చెప్పిన ఈసీ, ఇంత బ్లండర్ మిస్టేక్ ఉన్న మల్లారెడ్డి నామినేషన్ను పగిరణనలోకి తీసుకోవడంపై నిరుద్యోగులు, విద్యార్థులు ట్రోల్ చేస్తున్నారు. ఒకే ఏడాది మూడు కాలేజీల్లో ఎలా చదవాలో సీక్రెట్ చెప్పాలని కోరుతున్నారు.