Middle Class Growth In India: ఎంఎస్ స్వామినాథన్ తీసుకొచ్చిన హరిత విప్లవం ద్వారా దేశంలో ఆకలి తీరింది. వర్గీస్ కురియన్ తీసుకొచ్చిన శ్వేత విప్లవం ద్వారా దేశంలో పాల వెల్లువ మొదలైంది. పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి వైపు పయనిస్తోంది. నాడు పీవీ నరసింహారావు దీర్ఘ దృష్టితో చేసిన ఆలోచన ఇవాళ భారతదేశానికి కొత్త ఆయువుపట్టులా నిలుస్తోంది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద వినియోగదారులు ఉన్న దేశంగా భారత్ అవతరించింది అంటే దానికి కారణం నాటి ఆర్థిక సంస్కరణలే.

మధ్య తరగతి పెరుగుతోంది
గత మూడు దశాబ్దాలతో పోలిస్తే భారతదేశంలో మధ్యతరగతి పెరుగుతున్నది. ప్రైస్ థింక్ టాంక్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడి అయింది. భారత దేశంలో సుమారు 30% దాకా మధ్యతరగతి ప్రజలే ఉన్నట్టు ఆ సంస్థ చేసిన సర్వేలో తేటతెల్లమైంది. 2047 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు అయ్యే సమయానికి ఈ మధ్యతరగతి ప్రజలు 63 శాతానికి చేరుకుంటారని ఒక అంచనా వేసింది.. దీనివల్ల భారతదేశం కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపింది.
పెరిగితే ఏమవుతుంది
మధ్యతరగతి పెరిగితే దేశంలో పేదరికం స్థాయి తగ్గినట్టు. మధ్యతరగతి పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. సోషల్ ఆక్టివిజం, పొలిటికల్ ఆక్టివిజం పెరుగుతుంది. దీనివల్ల అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం అమెరికా కొనుగోలు శక్తి పెరగడం వల్లే ఆ దేశం ఆగరాజ్యంగా వెలుగొందుతోంది. ఇక 2047 నాటికి భారతదేశంలో మొదటి 63 శాతం వరకు పెరిగితే భారత్ అత్యంత పట్టిష్టమైన స్థితిలో ఉంటుంది. బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తాయి. దీని వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్లో అమెజాన్ డాటా సెంటర్ ఉంది. అమెరికా వెలుపల అమెజాన్ కంపెనీకి ఉన్న ఏకైక అతిపెద్ద డాటా సెంటర్ కూడా ఇదే. దీనివల్ల హైదరాబాదులో సుమారు 7000 కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇదే లెక్కన భారతదేశంలో మధ్యతరగతి పెరిగితే మరిన్ని కొత్త అవకాశాల సృష్టి జరుగుతుంది.
ప్రజల ఆలోచన విధానం మారుతుంది
మధ్యతరగతి పెరిగితే దేశంలో పేదరికం స్థాయి తగ్గుతుంది. ప్రజల కనీస అవసరాలు తీరుతాయి. ముఖ్యంగా విద్య, వైద్యం అనేది అందుబాటులోకి వస్తుంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే.. మధ్యతరగతి శాతం పెరగడం వల్ల ప్రజల ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. పిల్లల్ని మంచి మంచి విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. వారు కూడా కన్నవాళ్ళ కలల్ని నిజం చేస్తూ విద్యలో రాణిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీలో తెలుగువారి వాటా ఎక్కువ. బహుళ జాతి సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తున్నారు. మూడు దశాబ్దాలతో పోలిస్తే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలుగువారి శాతం ఇప్పుడు ఎక్కువైంది. తక్కువలో తక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఏటా సుమారు 30 వేల మంది ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్తున్నారు. అక్కడే ఉన్నత ఉద్యోగాలు సాధించి స్థిరపడుతున్నారు.

అసమానతలు తగ్గాలి
ఇంతవరకు బాగానే ఉన్నా దేశంలో ఉన్న ఆర్థిక అసమానతుల వల్ల ప్రజలు పొదుపు చేసేశాతం తగ్గుతోంది. దేశ జనాభాలో 67% మంది కేవలం ఒక శాతం మాత్రమే పొదుపు చేస్తున్నారు. దీనివల్ల అది దేశ ఆర్థిక ప్రగతి దెబ్బతింటోంది. వివిధ అవసరాలకు అప్పులు తేవడం అనివార్యం అవుతుంది. దీనివల్ల కీలక రంగాలపై కోత పడుతున్నది. ప్రజల్లో పొదుపు చేసే శాతం పెరగాలంటే ఆర్థిక అసమానతలు తగ్గాలి. అవి జరగాలంటే మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి. గత సంస్కరణల వల్ల మధ్య తరగతి శాతం పెరుగుతోంది. వాటిని ఇంకా తీవ్రతరం చేస్తే 2030 నాటికే భారతదేశంలో మధ్యతరగతి శాతం అప్పటి మార్కును చేరుకుంటుందని ప్రైస్ థింక్ టాంక్ చెబుతోంది.