బీజేపీని ఎదుర్కొని నిలబడిన మమతా బెనర్జీకి క్రేజీ ఏర్పడింది. దేశవ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేసిన బెంగాల్ ఎన్నికలపై మోదీ, అమిత్ షా లాంటి నాయకులు ప్రచారం చేసినా విజయం అందుకోలేకపోయారు. అంటే మమతా బెనర్జీ విధానాలు అంతగా ప్రభావం చూపాయని తెలుస్తోంది. దీంతో జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన అనేక రాష్ర్టాలు ప్రస్తుతం మమతా బెనర్జీ వైపు చూస్తున్నాయని అంటున్నారు. మోదీని ఎదిరించాలంటే ఒక్క మమతతోనే సాధ్యమని, గాంధీ కుటుంబం వల్ల కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన మమతా బెనర్జీ ఢిల్లీ గద్దె నుంచి గుజరాతీలను పంపిస్తానని మమత బెనర్జీ శపథం చేశారు. దీంతో వివిధ రాష్ర్టాల నుంచి మద్దతు లభించింది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, బిహార్, ఢిల్లీ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు మోదీ పాలనపై విముఖత చూపుతున్నారు. దీంతో దేశాన్ని చుట్టి అక్కడి సమస్యలు ప్రత్యక్షంగా చూసి వాటి పరిష్కారానికి మార్గాలు చూపే విధంగా కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మూడో కూటమి ఏర్పాటుకు మమతా బెనర్జీ సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ లోను సీనియర్ నేతలు మమత బెనర్జీ నాయకత్వాన్ని నమ్ముతున్నారు. దీంతో మమత బెనర్జీ రాష్ర్టాల పర్యటనకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. వివిధ రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ యేతర ముఖ్యమంత్రులను, ఇతర రాష్ర్టాల విపక్ష నేతలను కలిసేందుకు మమత బెనర్జీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఏమేరకు ప్రభావం చూపుతారో తెలియాల్సి ఉంది.