Abhishek Banerjee: 15 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించారు. ప్రతిపక్షం అనేది లేకుండా తొక్కిపడేశారు. భౌతిక దాడులు చేయించారు. రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాని.. చెప్పుకోలేని పనులు కూడా చేయించారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉంటే.. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వ్యవస్థీకృత శక్తి లాగా తయారయ్యాడు. షాడో ముఖ్యమంత్రిగా బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. శాంతిభద్రతల విషయంలో పదేపదే వేలు పెడుతూ బెంగాల్ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా మార్చేశాడు.
ఎన్ని రకాల గొడవలు జరిగినా.. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా అభిషేక్ బెనర్జీని మమత వెనకేసుకొచ్చారు. అతడి కోసం పార్టీలో సీనియర్ నాయకుల రాజకీయ భవితవ్యాన్ని మమత బలి పెట్టారు. వారికి మంత్రి పదవులు ఇవ్వకుండా.. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా.. రకరకాల కేసులు పెట్టి వేధించారు. చివరికి వారంతా బయటకు రావడంతో మమత పీఠం కూలిపోయింది. 15 సంవత్సరాలుగా బెంగాల్ రాష్ట్రంలో ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం మొత్తం పడిపోయింది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. వాస్తవానికి 15 సంవత్సరాలపాటు బెంగాల్ రాష్ట్రంలో పరిపాలన సాగించిన టిఎంసి ఇలా మారిపోవడానికి అసలు కారణాన్ని ఆ పార్టీ తిరుగుబాటు నేత రిత బ్రత బెనర్జీ బయటపెట్టారు. అభిషేక్ బెనర్జీ వల్లే పార్టీలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
“మమతా బెనర్జీని మేము గౌరవిస్తున్నాం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ పెత్తనం పెరిగిపోయింది. అతడి నాయకత్వాన్ని మేము ఒప్పుకోము. పార్టీ కోసం అతడు ఏమి చేయలేదు. కానీ అతడికి ఉన్నత స్థానాన్ని మమత ఇచ్చారు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల కోసం కాకుండా.. అభిషేక్ కోసం లేచి నిలబడి చప్పట్లు కొట్టాలని మమత మాకు చెప్పారు. అప్పటికే మేము ఓటమిలో ఉన్నాం. బాధలో ఉన్నాం. అది చాలా ఇబ్బంది కలిగించింది. పైగా ఆ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలతో సంతకాలు కూడా తీయించుకున్నారు. సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేల పేర్లు రాసుకున్నారు. అవినీతి మా పార్టీలో పెరిగిపోయింది. దానిని తొక్కి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 61 ఎమ్మెల్యేలు మా చేతిలో ఉన్నారు.. భవిష్యత్ కాలంలో మరింతమంది మాతో చేతులు కలుపుతారు.. ఇక ముందు మీరు చాలా చూస్తారు అంటూ” రిత బ్రత బెనర్జీ ఆవేశంగా మాట్లాడారు.
కేవలం రిత బ్రత మాత్రమే కాకుండా, చాలామంది ఎమ్మెల్యేలు అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలి మీద ఆగ్రహంగా ఉన్నారు. సువేందు అధికారి కూడా అభిషేక్ బెనర్జీ వల్లే బయటికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆయన బయటికి వెళ్లిపోయిన తర్వాత బెంగాల్ రాష్ట్రంలో బిజెపి బలోపేతం అయింది. ఇప్పుడు ఏకంగా ఆయన బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.. అభిషేక్ బెనర్జీ ఐపాక్ లాంటి సంస్థ చేతిలో పార్టీని పెట్టడం వల్లే ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న నేపథ్యంలో అభిషేక్ బెనర్జీని ఏం చేస్తారు.. మమత ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
