Mahasena Rajesh : అతను 2019 ఎన్నికల ముందు వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఆ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ గళం విప్పారు. వైసీపీ నుంచి నిర్బంధాల్ని, అవమానాల్ని ఎదుర్కొన్నారు. జనసేనతో కలిసి నడిచేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. కానీ అనివార్య కారణాలతో టీడీపీతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆయనెవరు ? ఆ కథేంటో చూద్దాం.
మహాసేన రాజేష్.. ఏపీలో సుపరితమైన పేరు. మహాసేన మీడియా ద్వార తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ కోసం ఏపీలో ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏం జరిగిందో తెలియదు. మహాసేన రాజేశ్ వైసీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేశాడు. కేసులను ఎదుర్కొన్నాడు. అప్పటి నుంచి వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాడు. క్రమంగా జనసేనకు దగ్గరయ్యాడు. పవన్ కళ్యాణ్ పై అభిమానం కురిపించాడు. జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. జనసేనలో చేరడమే తరువాయి అన్నట్టు ప్రచారం జరిగింది. కానీ తాజాగా టీడీపీలో చేరుతున్నట్టు రాజేష్ నిర్ణయం ప్రకటించాడు.
మహాసేన రాజేష్ టీడీపీలో చేరుతుండటం పట్ల వివరణ ఇచ్చాడు. తాను జనసేనలో చేరాలని భావించినప్పటికీ.. ఆ పార్టీ అధిష్టానం తనను పార్టీలోకి ఆహ్వానించడం పట్ల ఆలస్యం చేసిందని అన్నారు. మరో ఆరు నెలల తర్వాత ఆహ్వానించొచ్చని, కానీ అప్పటి వరకు ప్రజాక్షేత్రంలో పోరాడకుండా, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండలేనని చెప్పారు. జనసేనలోకి వెళ్లకున్నా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం తగ్గదని అన్నారు. ఏ పార్టీలో ఉన్నా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడమే తన లక్ష్యమని ప్రకటించారు.
2018లోనే టీడీపీలో చేరాలని భావించినప్పటికీ కొందరు అడ్డుపడ్డారని అన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలే ఆహ్వానించడంతో పార్టీలోకి వెళ్తున్నానని చెప్పారు. ఈనెల 16న పెద్దాపురంలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ ఖాయమైన నేపథ్యంలోనే మహాసేన రాజేష్ టీడీపీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారట. దీంతో జనసేనలో చేరడం విరమించుకుని, టీడీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.
మహాసేన రాజేష్ జనసేనలో చేరుతారని అందరూ భావించారు. జనసైనికులు కూడా ఇదే అనుకున్నారు. కానీ మహాసేన రాజేష్ నిర్ణయంతో కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడొద్దని హితవు పలికారు. అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది అతని ఇష్టమని అన్నారు. అది అతని ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు. నాగబాబు స్పందన ప్రజాస్వామికంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.