Nara Lokesh: తండ్రి అరెస్టుతో తల్లడిల్లిపోయిన లోకేష్ ఢిల్లీలో అడుగు పెట్టారు. పవన్ వచ్చి పొత్తుల ప్రకటన చేసిన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కొన్ని రోజులపాటు ఢిల్లీలో మకాం వేసి జాతీయస్థాయిలో బాబు అరెస్టు మీద ఫోకస్ వచ్చేలా చూస్తారని టిడిపి అనుకూల మీడియా ప్రచారం ప్రారంభించింది. వీలైనంతవరకూ అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి చంద్రబాబు అక్రమ అరెస్టు తీరును వివరిస్తారని తెలుస్తోంది. ఏపీలో దిగజారిన శాంతిభద్రతల పై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నదే లోకేష్ లక్ష్యంగా తెలుస్తోంది.
మరోవైపు లోకేష్ అమిత్ షా ను కలుస్తారని టాక్ నడుస్తోంది. నిన్న పవన్ మాట్లాడే క్రమంలో అమిత్ షా ను కలవనున్నట్లు ప్రకటించారు. అయితే అది సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు. అందులో హోం శాఖకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి. దీంతో అమిత్ షా బిజీగా ఉండే అవకాశం ఉంది.
ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలను కేంద్రం ఆసక్తిగా చూస్తోంది. రెండు పార్టీలకు సమ దూరం పాటిస్తోంది. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర పెద్దల సహకారం జగన్కు ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్ తాజా పొత్తు ప్రకటన నేపథ్యంలో బిజెపి సైతం కలిసి వస్తుందని టాక్ నడుస్తోంది. అయితే పార్లమెంట్లో కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే వైసిపి సాయం అవసరం. ఇటువంటి సమయంలో లోకేష్ కు కలిసే అవకాశం ఇస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు పవన్ పొత్తుల ప్రకటన చేసిన తర్వాత బిజెపిలో చేంజ్ కనిపిస్తోంది.
ఒకవేళ కానీ లోకేష్ కు అపాయింట్మెంట్ లభిస్తే టిడిపి తో పొత్తుకు బిజెపి ఆలోచిస్తున్నట్టే. ఇప్పటికే రామోజీరావు మధ్యవర్తిత్వంతోనే లోకేష్ ఢిల్లీలో అడుగుపెట్టగలిగారన్న ప్రచారం ఉంది. రాజ గురువుదే మొత్తం వ్యూహం అని.. అందులో భాగంగానే పవన్ పొత్తు ప్రకటన చేశారని.. ఏపీలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే… ఢిల్లీలో లోకేష్ తో కావలసినంత మైలేజ్ తెచ్చుకునేందుకు రామోజీ స్కెచ్ గీసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మరోవైపు సీఎం జగన్ సైతం ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో అగ్రనేతలు లోకేష్ కు అపాయింట్మెంట్ ఇస్తారా? లేకుంటే జగన్ ఒత్తిడికి తలొగ్గుతారా? అన్నది తెలియాల్సి ఉంది.