Actors: మనదేశంలో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కళ్యాణ్ దాకా రాజకీయాలలో రాణిస్తున్న వారే. వెండి తెరపై అశేషమైన ప్రజాభిమానాన్ని సంపాదించుకోవడం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణ అంశంగా మారింది. ఇటీవల తమిళనాడులో విజయ్ అనే నటుడు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కొత్త పార్టీ కూడా ఏర్పాటు చేశారు. త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇలా రాజకీయాల్లోకి వచ్చిన నటులందరూ విజయవంతం కాలేదు. కొందరు మధ్యలోనే రాజకీయాలను వదిలేస్తే.. ఇంకా కొంతమంది తమ పార్టీలను ఇతర పార్టీల్లో విలీనం చేశారు. ఇక ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలను చూసుకుంటే.. చాలామంది సినీ తారలు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇంతకీ ఎవరెవరు పోటీ చేయబోతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంటు స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.. మొదటినుంచి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న ఆమె బిజెపిలో చేరకముందే ఆ పార్టీ టికెట్ దక్కించుకోవడం విశేషం.
మీరట్ స్థానం నుంచి టీవీల్లో రాముడి పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్ గోరక్ పూర్ ప్రాంతం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తూ, తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నాట్యం చేసిన పంజాబీ మహిళ నవనీత్ కౌర్ కూడా మహారాష్ట్రలోని అమరావతి నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా పోటీ చేస్తోంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున సినీనటి లాకెట్ చటర్జీ పోటీలో ఉంది. ఆమెకు ప్రత్యర్థిగా టీఎంసీ సినీనటి రచనా బెనర్జీ రంగంలోకి దింపింది. రచన ఇదివరకు తెలుగు సినిమాల్లో నటించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఘటల్ పార్లమెంటు స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దీపక్ అధికారి మూడవసారి బరిలోకి దిగాడు. ఆయనకు పోటీగా భారతీయ జనతా పార్టీ సినీనటుడు హిరణ్మయి చటోపాధ్యాయ ను రంగంలోకి దిగింది.
పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి పోటీలో ఉన్నారు.
నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి భోజ్ పురి నటుడు మనోజ్ తివారి బిజెపి అభ్యర్థిగా మూడోసారి తలపడుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని అజం గడ్ స్థానం నుంచి భోజ్ పురి నరుడు దినేష్ లాల్ యాదవ్ వరుసగా రెండవసారి బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు
తమిళనాడులోని విరుద్ నగర్ స్థానం నుంచి తెలుగు తమిళ సీనియర్ నటి రాధిక బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో దివంగత నటుడు విజయ్ కాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ ఏఐఏడీఎంకే మద్దతుతో డీఎండీకే తరఫున పోటీ చేస్తున్నారు.
కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ నుంచి మలయాళ సీనియర్ నటుడు సురేష్ గోపి బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు.
ఒడిశాలోని బొల్లం గిరి నుంచి ప్రముఖ నటుడు మనోజ్ మిశ్రా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు.
కడలూరు నుంచి బిజెపి తరఫున సినీ నటుడు తంగర్ బచన్ పోటీ చేస్తున్నాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More