ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరగడానికి కారణాలు ఇవే..!

ఎల్జీ పాలిమర్స్‌లో ఈ నెల మొదటి వారంలో విషవాయువు లీక్ అయి 12 మంది మృతి చెందడానికి దారితీసిన సంఘటన అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, బాధ్యత గల అధికారులు `ప్యాకేజి’ తనిఖీలతో భద్రతా ప్రమాణాలను పట్టించుకోకుండా కొంపముంచారని ఏపీ ప్రభుత్వం నీయమించిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ధారించింది. సీనియర్ ఐఎఎస్ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటైన హై పవర్‌ కమిటీ ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక విభాగాల నుంచి సరైన తనిఖీ విధానాలు […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 4:23 pm
Follow us on


ఎల్జీ పాలిమర్స్‌లో ఈ నెల మొదటి వారంలో విషవాయువు లీక్ అయి 12 మంది మృతి చెందడానికి దారితీసిన సంఘటన అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, బాధ్యత గల అధికారులు `ప్యాకేజి’ తనిఖీలతో భద్రతా ప్రమాణాలను పట్టించుకోకుండా కొంపముంచారని ఏపీ ప్రభుత్వం నీయమించిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ధారించింది.

సీనియర్ ఐఎఎస్ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటైన హై పవర్‌ కమిటీ ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక విభాగాల నుంచి సరైన తనిఖీ విధానాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చిచెప్పింది. పైగా, వాళ్లంతా ఏమి జరుగుతుందో చెబుతున్నారే తప్ప, బాధ్యతగల అధికారులుగా పనిచేయలేదని మండి పడింది.

వీరికి ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతోపాటు ఆ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని, కానీ అందుతున్న ‘ప్యాకేజీ’లతో వాటిని విస్మరించారని ఆరోపించింది. వీరి నిర్వాకం కారణంగానే ఎల్జీ పాలిమర్స్‌ కంటే ముందు విశాఖ జిల్లాలో గత ఆరు నెలల్లో పలు ప్రమాదాలు జరిగి 40 మంది వరకు మృతి చెందారని ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిపై కూడా విచారణలు జరిపించి నిజం నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఎల్జీ పొలిమెర్స్ లో ప్రమాణాల మేరకు అర్హత గల వ్యక్తులు లేనేలేరని తేల్చి చెప్పింది. సంస్థలో కాంపిటెంట్‌ సూపర్‌వైజర్‌ గా ముంబై సెంట్రల్‌ ల్యాబ్‌ ఇనిస్టిట్యూట్‌ సర్టిఫై చేసిన వ్యక్తే ఉండవలసి ఉండగా లేరు. అట్లాగే ఇండస్ట్రియల్‌ హైజీన్‌లో నిష్ణాతులైన మెడికల్‌ ఆఫీసర్‌ ఉండి యాంటీడోట్స్‌ జాగ్రత్త చేయాల్సి ఉండగా, అది కూడా అమలు చేయలేదని కమిటీ తెలిపింది.

అసలు భద్రతాపరమైన సన్నద్ధత గురించి ఫ్యాక్టరీ యాజమాన్యం గాని, బాధ్యులైన అధికారులు గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెబుతూ గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఎల్జీ పాలిమర్స్‌ వెంకటాపురంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించలేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది.

విశాఖపట్నంలో ప్రభుత్వ సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, నేవీ వంటివి మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తుండగా, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌, ఆంధ్రా పెట్రో కెమికల్స్‌, ఎల్జీ పాలిమర్స్‌ వంటివి కూడా ఆ పని చేయడం లేదని వెల్లడించింది.

ఎల్జీ పాలిమర్స్‌ లో ప్రమాదం జరగడానికి డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ (డీసీఐ) విశాఖపట్నం అధికారి కేబీఎస్‌ ప్రసాద్‌ నిర్లక్ష్యమే కారణమని నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ నిగ్గు తేల్చింది. రసాయన పరిశ్రమలను ఎలా నడపాలో, ఎమర్జెన్సీ ప్లాన్‌లు ఎలా రూపొందించాలో, మాక్‌డ్రిల్స్‌ ఎలా నిర్వహించాలో తెలియని వ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని కమిటీ తప్పుపట్టింది.

డిసిఐ ప్రతి ఏటా ఫ్యాక్టరీలో భద్రతా పర పరిస్థితులపై తనిఖీ చేయవలసి ఉండగా నాలుగేళ్ల క్రితం ఒక సారి తనిఖీ చేసిన ప్రసాద్ నివేదికను సమర్పించని లేదని విస్మయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెండేళ్లు ఎవ్వరు చేయలేదని, గత ఏడాది ప్రసాద్ తిరిగి చేసినా అసంపూర్తిగా నివేదిక ఇచ్చారని అంటూ కమిటీ వివరించింది.