Huzurabad Bypoll: గెలుస్తుందనకున్న హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి కృంగదీసింది. ముందునుంచి అనుకున్నట్టుగా టీఆర్ఎస్ హుజూరాబాద్ లో గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఏకంగా బీజేపీ అభ్యర్థి ఈటలపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 24వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఎన్ని కోట్లు పంచినా.. దళితబంధు తెచ్చినా.. పథకాలు, అభివృద్ధి చేసినా ఈటలకే హుజూరాబాద్ ప్రజలు పట్టం కట్టారు.ఈ క్రమంలోనే హుజూరాబాద్ లో ఓటమిపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థిపై గెల్లు శ్రీనివాస్ స్పందించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని.. భవిష్యత్ పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లు చవిచూసిందని.. ఒక్క ఓటమికే కార్యకర్తలు కృంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. పోరాడిన గెల్లు శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక మంత్రి హరీష్ రావు సైతం హుజూరాబాద్ లో ఓటమిపై స్పందించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయి. ఈ ఓటమితో టీఆర్ఎస్ కుంగిపోదు.. గెలిచినా నాడు పొంగిపోలేదు. టీఆర్ఎస్ కు ఓట్లేమీ తగ్గలేదన్నారు.
హుజూరాబాద్ లో ఓటమిపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ వివరణ ఇచ్చాడు. టీఆర్ఎస్ కు ఓటేసిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు. నా గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.