గతంలోనే చాలాసార్లు కేఆర్ ఎంబీ ప్రాజెక్టును సందర్శించాలని అనుకున్నా ఆచరణ సాధ్యం కాలేదు. దీనికి ఏపీ సర్కారు మాత్రం పదేపదే వద్దని వారిస్తోంది. రక్షణ ఉండదనే కారణంతో కృష్ణా బోర్డు ఇన్నాళ్లు అక్కడ పర్యటించలేదు. అయితే ఎన్జీటీ ఆదేశాలను సైతం ఏపీ పట్టించుకోలేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన బోర్డు ప్రాజెక్టును సందర్శించాలని తేల్చి చెప్పడంతో ఈనెల 5న కేఆర్ ఎంబీ బృందం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనుంది.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు లేకపోయినా నిర్మాణ పనులు ఆగడం లేదని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తోంది. ఏపీ మాత్రం అక్కడ పనులు జరగడం లేదని బుకాయిస్తోంది. డీపీఆర్ కు సర్వే పనులు మాత్రమే చేస్తున్నామని పేర్కొంటోంది.
అక్కడ పనులు జరుగుతున్నాయని ఎన్జీటీకి ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది. గతంలోనే పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తామని ఎన్జీటీ హెచ్చరించింది. కేఆర్ఎంబీ కమిటీని ఏపీ ప్రభుత్వం అనుమతిస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో కమిటీ రిపోర్టు ఇస్తుందా అని ఆసక్తికరంగా మారింది. పనులు నిర్వహిస్తుండడంపై నివేదిక ఇస్తే ఏపీ చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి.