Site icon OkTelugu

Huzurabad Congress Candidate : కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇస్తోన్న కొండా సురేఖ

Huzurabad Congress Candidate Konda SurekhaHuzurabad, Konda Surekha : హుజురాబాద్ ఉప ఎన్నికపై పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ కాంగ్రెస్(Congress) పార్టీ మాత్రం తన అభ్యర్థి ప్రకటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కూడా కొన్ని డిమాండ్లు కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం. బుధవారం రావిర్యాలలో జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సురేఖ పేరు ప్రకటిస్తారని అందరు భావించినా అలా జరగలేదు. అయితే దీనిపై కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కొండా సురేఖ సుముఖత వ్యక్తం చేసినా కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో బరిలో నిలవాలంటే తనకు కొన్ని కోరికలు ఉన్నాయని చెప్పినట్లు తెలిసింది. వాటిని అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం. దీంతో వాటిని తీరుస్తామని అంగీకరిస్తేనే తాను పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆమె డిమాండ్లకు ఓకే చెప్పి రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.

సురేఖ లక్ష్యం 2023 ఎన్నికలేనని చెప్పినట్లు తెలిసింది. అందుకే తాను ప్రస్తుతం హుజురాబాద్ లో పోటీ చేసినా తరువాత వచ్చే ఎన్నికల్లో కూడా తనకు హుజురాబాద్ టికెట్ ఇవ్వాలని కోరింది. ఏడాదిన్నరలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని తన మనసులోని కోరికను వెల్లడించింది దీనికి అధిష్టానం కూడా సరే అనడంతో ఆమె అభ్యర్థిత్వంపై సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కొండా సురేఖను ఎలాగైనా పోటీకి దింపి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా వచ్చే ఎన్నికల్లో వరంగల్ అర్బన్, పరకాల, భూపాలపల్లి టికెట్లను తాను సూచించిన వారికే కేటాయించాలని మరో డిమాండ్ పెట్టినట్లు చెబుతున్నారు. దీనికి కూడా కాంగ్రెస్ ఒప్పుకుంటేనే తాను పోటీకి సిద్ధమని ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సురేఖను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. భూపాలపల్లి విషయంలో వెనక్కి తగ్గితే వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్, పరకాల, వరంగల్ అర్బన్ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు నిర్ణయం ఆమెకే వదిలేయాలని పార్టీ పెద్దలు సూచించారు.

హుజురాబాద్ నియోజవర్గంలో బీసీ సామాజిక వర్గాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కొండా సురేఖ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం సమ ఉజ్జీ అయిన వారి కోసం అన్వేషించి సురేఖ అయితే సరైన అభ్యర్థి అని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు భయం పుట్టించాలంటే సురేఖ అయితేనే బాగుంటుందని అందరు సూచించడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఆమె పేరు సూచించి ఆమెను ఒప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికలో కొండా సురేఖ బరిలో నిలబడితే రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version