Corona Third Wave: చైనాలో పుట్టి ప్రపంచానికి పాకిన కరోనా మహమ్మారి ఇంకా పలు చోట్ల విజృంభిస్తూనే ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంట్రోల్ అయిన ఈ వైరస్ ఒక్క కేరళలో మాత్రం ఇప్పటీకీ తగ్గడం లేదు. పైగా కేసులు పెరుగుతూ ఆ రాష్ట్రం థర్డ్ వేవ్ దిశగా సాగుతోంది.
కరోనా సెకండ్ వేవ్ తో అన్ని రాష్ట్రాలు అల్లాడాయి. లక్షల కేసులు.. వేలమంది చనిపోయారు. మరణ మృదంగం వినిపించింది. కరోనా రెండో దశ విజృంభణ నుంచి దక్షిణాది రాష్ట్రం కేరళ ఇంకా బయటపడలేదు. ఇటీవల అక్కడ వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపించినా తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దారుణం ఏంటంటే.. దేశవ్యాప్తంగా వెలుగుచూసిన మొత్తం కొత్త కేసుల్లో దాదాపు 65శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 37,593 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. క్రితం రోజు 25,467 కేసులు నమోదు కాగా.. ఈ సంఖ్య 47.6 శాతం ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.25 కోట్లు దాటగా తాజా కేసుల్లో 64.6 శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం గమనార్హం. నిన్న ఆ రాష్ట్రంలో ఏకంగా 24,296 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మేనెలలో సెకండ్ వేవ్ తర్వాత కేరళలో నిన్ననే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా 648 మంది కరోనాతో చనిపోతే అందులో ఒక్క కేరళలోనే 173 మంది మృతిచెందడం విషాదం నింపింది. దేశంలో ప్రస్తుత పాజిటివిటీ రేటు 1 శాతం దిగువకు చేరింది.
దీన్ని బట్టి ఒక్క కేరళలో మాత్రమే కరోనా థర్డ్ వేవ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అది దేశమంతా విస్తరించకుంటే అందరూ సేఫ్. తెలంగాణ సహా దేశంలోని రాష్ట్రాలన్నీ విద్యాసంస్థలు తెరుస్తున్న వేళ ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది.