BRS In AP: వినేవాడు వెర్రివాడు అయితే.. చెప్పేవాడు కల్వకుంట చంద్రశేఖర్ రావు అన్నట్టుంది పరిస్థితి. ఈ పద ప్రయోగాన్ని తెలంగాణలో విపక్ష నేతలు ఎప్పుడో వాడేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ విస్తరణ పని మీద ఉన్న కేసీఆర్ జాతీయ వాదం గురించి గొప్పగా లెక్చర్ ఇవ్వడం ప్రారంభించారు. దేశసమగ్రత, ఐక్యత గురించి గొప్పగా మాట్లాడేస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్టులను బయటపెడుతున్నారు. ఆ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాద్ షాలో డ్రీమ్ మిషన్ తరహాలో తన కలల సాకారాన్ని, భవిష్యత్ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. సొ అంతవరకూ బాగానే ఉన్నా.. వివాదాలు, ఉద్వేగాలు, విధ్వంసాలు, దుష్ప్రచారాలు లేని దేశం కావాలంటూ గొప్పగా సెలవిచ్చారు. సామాన్యుడు, చదువురాని వాడు, సమకాలిన అంశాలపై పెద్దగా అవగాహన లేనివారికి ఇవి గొప్పగా అనిపించవచ్చు.. కానీ వీటన్నింటిని చేసి.. దాటుకొని వచ్చిన చరిత్రను కేసీఆర్ మరిచిపోయారు. అసలు అటువంటివి నాకు తెలియవంటున్న రీతిలో సెలవిచ్చారు. బీఆర్ఎస్ లో కి కొంతమంది ఏపీ నేతలు చేరే సమయంలో నిజంనిజాయితీ లేని చాలా మాటలు చెప్పుకొచ్చారు.

వాస్తవానికి ప్రజల్లో విభజన తెచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమించింది ఎవరు? దాని గురించి విధ్వంసాలకు దిగింది ఎవరు? చివరకు దయాది రాష్ట్రంతో పైచేయి సాధించేందుకు వివాదాలు సృష్టించిందెవరు? అన్నది ఇప్పుడు కేసీఆర్ కు ఎదురవుతున్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పోరాటం చేయడంలో తప్పులేదు. కానీ ఆ పోరాటం వెనుక ఏపీ ప్రజలపై విధ్వేషాలను నింపింది మాత్రం ముమ్మాటికీ కేసీఆరే అటు స్వరాష్ట్రానికి మోసం చేసింది కూడా ఆయనే. బీఆర్ఎస్ డ్రీమ్ ప్రాజెక్టలను చెప్పే క్రమంలో నది జలాల గురించి ప్రస్తావించారు. దేశంలో ఇన్ని కోట్ల భూములున్నాయి. ఇంతే సాగవుతున్నాయి. నదుల నీరు వృథాగా పోతుందని గణాంకాలతో చెప్పుకొచ్చారు. దేశం పట్ల తనకున్న సమగ్ర అవగాహనను బయటపెట్టారు. అంతవరకూ ఓకే కానీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఫెయిలైనట్టు చూపారు. బీఆర్ఎస్ వస్తే బంగారు దేశాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణను ఇదే మాదిరిగా బంగారు తెలంగాణ చేస్తామని భ్రమ కల్పించారు. ఉద్యమ తెలంగాణను కాస్తా బంగారు తెలంగాణ గా మార్చారు. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ గా మార్చారు. అంటే సమాజం అలానే ఉంది కానీ తన పార్టీ మాత్రం ఎదుగుతోందని కేసీఆర్ చెప్పకనే చెప్పారు.

ఇండియన్ ఎకానమిపై కూడా మాట్లాడారు. భారత్ ఆర్థికంగా వెనుకబాటుకు మోదీ విధానాలే కారణమని చెప్పుకొచ్చారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తరువాత ఆ స్థాయిలో ప్రధాని దొరకలేదని కీర్తించారు. బీఆర్ఎస్ తో సింగపూర్ తరహాలో ఆలోచన చేసి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వరల్డ్ ఎకానమీలో 11 వ స్థానంలో ఉన్న ఇండియా ప్రస్తుతం ఐదో స్థానానికి వచ్చిందన్న విషయాన్ని చెప్పలేదు. మూడో స్థానానికి పోటీ పడుతుందని కూడా గుర్తించేందుకు సాహిసించలేదు. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణ అనేది కేసీఆర్ ముందున్న కర్తవ్యం. దానిని ఎవరూ కాదనలేరు కానీ.. ప్రజలకు నిజాలు తెలియవని మాత్రం ఆయన భ్రమపడుతున్నారు. ప్రాంతీయ వాది నుంచి జాతీయ వాదిగా మారిన క్రమంలో నదీ జలాల వివాదంపై మాట్లాడుతున్నారు. అది కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నదీ జలాలను సృష్టించిందే తాను అన్న విషయం మరిచిపోతున్నారు. అటు రాష్ట్ర విభజనకు ముందు నుంచి నేటి వరకూ అడుగడుగునా ఏపీని అడ్డగించింది కేసీఆర్ కాదా? ఏపీ ప్రభుత్వం సాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డి ప్రాజెక్టునువెడల్పు చేస్తే అడ్డుకుంది కేసీఆర్ కాదా? కృష్ణా జిల్లాల గురించి గొడవ చేస్తుందెవరు? గోదావరి జలాల గందరగోళం చేసిందెవరు? కృష్ణా, గోదావరి జలాల రివర్ బోర్డ్స్ పై వివాదంచేస్తుందెవరు? ఇవన్ని మరిచిపోయిన కేసీఆర్ గొప్ప జాతీయ వాదిగా తనను తాను చూపించుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రజలను భ్రమ పెట్టేందుకు యత్నిస్తున్నారు. అయితే తెలంగాణలో కుదిరినట్టు ఏపీలో కేసీఆర్ పాచికలు పారవు. ఇక్కడ నిజాలు చెప్పి.. గతంలో జరిగిన, చేసిన తప్పిదాలపై క్షమాపణలు కోరితే కానీ ఏపీ ప్రజలు క్షమించరన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది.